రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. విజయవాడ యార్డ్‌లోని నాలుగో నంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద జరుగుతున్న పనుల కారణంగా కొన్ని రైలు సర్వీసులను దారి మళ్లిస్తున్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ - విశాఖపట్నం రైలు (12740), విశాఖపట్నం - సికింద్రాబాద్ రైలును ( 12739) అధికారులు దారి మళ్లిస్తున్నారు. ఈ విషయాన్ని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏప్రిల్ 17 నుంచి మే 31వ తేదీ వరకూ ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దారి మళ్లింపు కారణంగా ఈ రైళ్లు విజయవాడకు వెళ్లవని.. విజయవాడ రైల్వేస్టేషన్‌లో స్టాపింగ్ తప్పించినట్లు అధికారులు తెలిపారు. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి.. అందుకు అనుగుణంగా తమ ప్రయాణాలు షెడ్యూల్ చేసుకోవాలని కోరారు. సికింద్రాబాద్- విశాఖపట్నం, విశాఖపట్నం - సికింద్రాబాద్ రైళ్లు ప్రస్తుతం రాయనపాడు, విజయవాడ, గుణదల రైల్వేస్టేషన్‌ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే దారి మళ్లింపు కారణంగా ఏప్రిల్ 17వ తేదీ నుంచి 45 రోజుల పాటు ఈ రైళ్లు, రాయనపాడు - విజయవాడ బల్డ్ క్యాబిన్ - విజయవాడ నార్త్ క్యాబిన్ - గుణదల రైల్వేస్టేషన్ మార్గంలో రాకపోకలు సాగించనున్నాయి. విజయవాడ రైల్వేస్టేషన్‌ను రైళ్లు వెళ్లే మార్గం నుంచి మినహాయించారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో కోరింది. మరోవైపు విజయవాడ రైల్వేస్టేషన్‌లో పనుల కారణంగా కొన్ని ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. నర్సాపూర్, మచిలీపట్నం, భీమవరం, విజయవాడ మీదుగా ప్రయాణించే కొన్ని ప్యాసింజర్ రైళ్ల సర్వీసులను ఏప్రిల్ 17 నుంచి జూన్ 1వ తేదీ వరకూ తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నర్సాపూర్ - విజయవాడ ప్యాసింజర్ రైలు సర్వీసును 67276) ఏప్రిల్ 17 నుంచి మే 31వ తేదీ వరకూ రామవరప్పాడు నుంచి విజయవాడ మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు. అలాగే విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ రైలు సర్వీసును విజయవాడ నుంచి రామవరప్పాడు మధ్య రద్దు చేశారు. విజయవాడ - భీమవరం ప్యాసింజర్ రైలును విజయవాడ నుంచి రామవరప్పాడు మధ్య, మచిలీపట్నం- విజయవాడ ప్యాసింజర్ రైలు సర్వీసును రామవరప్పాడు నుంచి విజయవాడ మధ్య రద్దు చేశారు. విజయవాడ - నర్సాపురం ప్యాసింజర్ రైలు సర్వీసును విజయవాడ నుంచి రామవరప్పాడు మధ్య క్యాన్సిల్ చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.