ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. WDRA (డబ్ల్యూడీఆర్‌ఏ-గోదాముల నియంత్రణ, అభివృద్ధి సంస్థ) రైతులు తమ పంటలకు మంచి ధర వచ్చే వరకు నిల్వ చేసుకోవడానికి ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు రైతులు నిల్వ చేసిన సరుకుపై ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.75 లక్షల వరకు బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు. ఆన్‌లైన్ వేదిక ద్వారా గోదాముల యజమానులు, బ్యాంకులు, వ్యాపారులు, రైతులను కలుపుతూ రుణ లభ్యతను పెంచుతున్నారు. ఈ పద్ధతి వల్ల పారదర్శకత, వేగం పెరిగి, నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి, పంట వృథా తగ్గుతోంది. CCRL, NERL సంస్థలు ఈ ఆన్‌లైన్ ప్రక్రియకు సాంకేతిక సహాయం అందిస్తున్నాయి.WDRA (డబ్ల్యూడీఆర్‌ఏ) వద్ద దరఖాస్తు చేసుకుంటే, ప్రత్యక్షంగా పరిశీలన చేసి గోదాములకు రిజిస్ట్రేషన్ ఇస్తారు. ఈ గుర్తింపు ఐదేళ్ల కాలానికి ఉంటుంది. ఈ గుర్తింపు ఆధారంగా బ్యాంకులు నిల్వ చేసిన వారికి రుణాలు ఇస్తాయి. ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరుగుతుంది కాబట్టి, పారదర్శకంగా, వేగంగా పనులు పూర్తవుతాయి. ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉండటంతో, WDRA (డబ్ల్యూడీఆర్‌ఏ)ను సంప్రదించే వారి సంఖ్య పెరుగుతోంది. దీనివల్ల రైతులు తమ పంటలను శాస్త్రీయ పద్ధతుల్లో ఎక్కువ కాలం నిల్వ చేస్తున్నారు. ఫలితంగా, నాణ్యమైన పంట ఉత్పత్తులు ఎక్కువగా అందుబాటులోకి వస్తున్నాయి. డబ్ల్యూడీఆర్‌ఏ గుర్తింపు పొందిన గోదాముల్లో పంట నిల్వ చేసిన రైతులకు ఇప్పుడు సులభంగా బ్యాంక్ రుణాలు లభిస్తున్నాయి. గోదాము యజమాని ఎలక్ట్రానిక్‌ నెగోషిబుల్‌ వేర్‌హౌస్‌ రిసిప్ట్‌ (బాండు) ఇస్తారు. దీని ఆధారంగా బ్యాంకులు రుణాలు ఇస్తాయి. రైతులు తమ పంటను వెంటనే అమ్ముకోకుండా, మంచి ధరలు వచ్చేవరకు వేచి చూసి లాభం పొందవచ్చు. ఈ బాండులో రైతు వివరాలు, నిల్వ చేసిన సరుకు విలువ ఉంటాయి. ఈ బాండును చూపి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు.రైతులు తమకు నచ్చిన బ్యాంకును ఎంచుకోవచ్చు. వడ్డీ శాతం, ఇతర షరతులు చూసి రుణం తీసుకుంటారు. దీనివల్ల పంటకు తక్కువ ధర ఉన్నప్పుడు అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. మంచి ధరలు వచ్చేవరకు వేచి చూసి, అప్పుడు అమ్మి ఎక్కువ లాభం పొందగలుగుతారు. 'ఈ-కిసాన్‌ ఉపజ్‌ నిధి పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా రైతులు ఆరు నెలల వరకు ఏదైనా నమోదైన గోడౌన్‌లో పంటను నిల్వ చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. అయితే రైతులకు ఇచ్చిన ఆ బాండు ఆధారంగా 7 శాతం వడ్డీకి పూచీకత్తు లేకుండా వెంటనే రుణం ఇస్తారు. క్రెడిట్‌ గ్యారంటీ పథకం విషయానికి వస్తే.. రైతులు, నిల్వదారులు, వ్యాపారులు పొందే బ్యాంకు రుణాలకు ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుంది. ఇది రైతులకు రూ.75 లక్షల వరకు, వ్యాపారులు, రైతు ఉత్పత్తి సంఘాలకు రూ.2 కోట్ల వరకు వర్తిస్తుంది' అని తెలిపారు.