శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. డిసెంబర్ నెలలో మూడు రోజులకు సంబంధించిన రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల విడుదలను తిరుమల దేవస్థానం వాయిదా వేసింది. డిసెంబర్ 29, 30, డిసెంబర్ 31వ తేదీలకు (వైకుంఠ ద్వార దర్శనం) సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం , శ్రీవాణి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లను పరిపాలనా కారణాల వలన విడుదల చేయడం లేదని తెలిపింది. ఈ టిక్కెట్ల విడుదలకు సంబంధించిన సవరించిన షెడ్యూల్‌ను త్వరలోనే విడిగా ప్రకటిస్తామని తెలిపింది. తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.*తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణమరోవైపు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం అంకురార్పణ చేశారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వ‌ర‌కు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా ఆల‌యంలోని యాగశాలలో భూమాత‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టమన్నులో న‌వ‌ధాన్యాలను నాటారు. ఆగమోక్తంగా ఈ కార్యక్రమం పూర్తి చేశారు. ఇక వైఖానస ఆగమంలో అంకురార్పణ కార్యక్రమానికి విశేష ప్రాధాన్యముంది. అంకురార్పణ అంటే విత్తనాలు మొలకెత్తడం అని అర్థం. ఉత్సవాలు విజయవంతం కావాలని, స్వామివారి ఆశీస్సులు కోరటమే ఈ కార్యక్రమం ఉద్దేశం.*అలాగే సూర్యాస్తమయం తర్వాత మాత్రమే అంకురార్పణ నిర్వహిస్తారు. జ్యోతిష శాస్త్రాల ప్రకారం పగటి పూట విత్తనాలను ఆరోపింపచేయడం మంచిది కాదు. సాయంత్రం సమయంలో మంచి ముహూర్తంలో అంకురార్పణ చేస్తారు. అంకురార్పణంలో పలు విత్తనాలు నాటుతారు. పాలికలు అనే మట్టికుండలలో విత్తనాలను నాటుతారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. దీని వలన ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని నమ్మకం. మంగళవారం సాయంత్రం జరిగిన అంకురార్పణ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవోఅనిల్ కుమార్ సింఘాల్, ఏఈవో సి.హెచ్.వెంక‌య్య చౌద‌రి సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. * మరోవైపు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా గరుడ వాహన సేవ రోజున భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గ్యాలరీల నుంచి భక్తులు స్వామివారి వాహన సేవలు వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.