కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల పంచాయితీ కాస్తా ఇంటి నుంచి ఆస్పత్రికి.. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వరకూ చేరింది. పెళ్లి అయిన కొన్ని నెలలకే తన భర్త నపుంసకుడు అని.. సంసారనికి పనికిరాడని ఓ భార్య చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. భర్తపై ఇలాంటి ఆరోపణలు చేయడమే కాకుండా.. అతడి నుంచి డబ్బులు వసూలు చేయాలని ఆ భార్య నిర్ణయించుకుంది. అతడిపై నింద వేయడమే కాకుండా.. వేధింపులకు గురి చేసింది. పైగా రూ.2 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. భార్య వింత ప్రవర్తన తట్టుకోలేని భర్త పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు బయటికి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే?బెంగళూరు‌లోని గోవిందరాజ్‌నగర్‌కు చెందిన 35 ఏళ్ల వ్యక్తికి, 29 ఏళ్ల యువతికి ఈ ఏడాది మే 5వ తేదీన వివాహం అయింది. పెళ్లి అయిన తర్వాత నవ దంపతులు ఇద్దరూ సప్తగిరి ప్యాలెస్‌లో కొత్త కాపురం ప్రారంభించారు. అయితే.. పెళ్లి అయిన 3 నెలల తర్వాత కూడా.. తన భర్త తనతో శారీరక సంబంధం పెట్టుకోకపోవడంతో ఆయనపై ఆ భార్య తీవ్ర ఆరోపణలు చేసింది. తన భర్తకు ఉందని భార్య అనుమానం వ్యక్తం చేసింది. అంతటితో ఆగకుండా.. మెడికల్ టెస్ట్‌లు చేయించుకోవాలని అతడిపై తీవ్ర ఒత్తిడికి గురి చేసింది.భార్య బలవంతం తట్టుకోలేని భర్త.. ఎట్టకేలకు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేశారు. ఆ వ్యక్తిని పరీక్షించిన డాక్టర్లు.. అతను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని తేల్చారు. అయితే మానసిక ఒత్తిడి కారణంగానే అలా జరిగి ఉంటుందని డాక్టర్లు వెల్లడించారు. అయితే డాక్టర్లు చెప్పినప్పటికీ.. ఆమె మాత్రం తన భర్తపై అనుమానాన్ని మాత్రం వీడలేదు. తన భర్త పెళ్లి చేసుకున్న తర్వాత సంసారం చేయడంలో విఫలం అయ్యాడని ఆరోపిస్తూ రూ.2 కోట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం ప్రారంభించింది.ఈ నేపథ్యంలోనే గత నెల 17వ తేదీన ఆమె తన బంధువులతో కలిసి గోవిందరాజ్ నగర్‌లోని తమ ఇంటికి వచ్చి తనను, తన కుటుంబ సభ్యులను తీవ్రంగా కొట్టినట్లు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే ఆ భర్త నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. ఆ భార్యపై వేధింపులు, దాడి కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాధితుడు.. తన భార్య బీజేపీ మీడియా విభాగంలో పనిచేస్తోందని.. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని బీజేపీ పార్టీని కోరాడు.