ప్రపంచంలోని కొన్ని దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కొన్ని తీవ్రమైన నేరాలకు మరణశిక్షలు కూడా అక్కడి ప్రభుత్వాలు విధిస్తూ ఉంటాయి. ఇలాంటి దేశాల్లో ముందువరుసలో ఉంటుంది. ఇరాన్‌లో నేరాలు చేస్తే.. చాలా కఠినమైన చట్టాలు ఉంటాయి. వాటి ఆధారంగా ఊహించని శిక్షలు అమలు చేస్తూ ఉంటారు. ఇక ప్రపంచ దేశాల్లో కెల్లా అత్యధికంగా మరణశిక్షలు విధించే దేశాల జాబితాలో ఇరాన్ పై వరుసలోనే ఉంటుందంటే.. అక్కడి శిక్షలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలా ఇష్టం వచ్చినట్లు మరణశిక్షలు అమలు చేయడంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నా.. కొన్ని దేశాలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇక మానవ హక్కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు.. ఈ మరణశిక్షల అమలుకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాయి. ఇరాన్‌లో విధిస్తున్న మరణశిక్షల పట్ల అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే 64 మందికి మరణశిక్షలు అమలు చేసిందని ఇరాన్‌ మానవ హక్కుల బృందం తాజాగా తెలిపింది. అంటే సరాసరిగా ప్రతీ రోజు 9 మందిని ఉరి తీసినట్లు తెలుస్తోంది. ఇక మొత్తంగా ఈ ఏడాది ఇప్పటికే 1000 మందికి పైగా మరణదండన అమలు చేసినట్లు ఇరాన్ మానవ హక్కుల సంఘం అంచనా వేసింది.మరోవైపు.. ఏటా పెరుగుతుండటం తీవ్ర ఆందోళనకరంగా మారుతోంది. గత 3 దశాబ్దాల్లో ఎప్పుడూ లేనివిధంగా.. ఇటీవలి కాలంలో మరణశిక్షలను ఇరాన్‌ ప్రభుత్వం అమలు చేస్తుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతేడాది అంటే 2024లో దాదాపు 975 మందికి మరణశిక్ష అమలు చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాదిలో ఆ సంఖ్య దాటిందని నార్వే కేంద్రంగా పని చేసే ఇరాన్ హ్యమన్ రైట్స్ టీమ్ స్పష్టం చేసింది. అయితే బయటి ప్రపంచానికి తెలిసిన లెక్క కంటే నిజానికి ఈ మరణాల సంఖ్య మరింత ఎక్కువగానే ఉండొచ్చని ఇరాన్ హ్యూమన్ రైట్స్ టీమ్ డైరెక్టర్‌ మహమూద్‌ అమిరీ మొగద్దాం అంచనా వేశారు.గతంలో రకకాల విధాలుగా మరణదండనను ఇరాన్‌ ప్రభుత్వం అమలు చేసేది. కానీ ప్రస్తుతం మాత్రం ఎక్కువగా ఉరిశిక్ష ద్వారానే ఈ మరణశిక్షలను అమలు చేస్తోందని తెలుస్తోంది. ఇక వీటిలో కూడా చాలా ఉరిశిక్షలను జైళ్లలోనే అమలు చేస్తున్నప్పటికీ.. బహిరంగంగా కూడా కొందరికి మరణశిక్షలు వేస్తున్నారు. హత్యలు, డ్రగ్స్ అక్రమ రవాణా, రేప్‌లు, లైంగిక దాడి వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినవారికి మరణశిక్షలు విధించి.. అమలు చేస్తోంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహా పలు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సంస్థల ప్రకారం.. చైనా తర్వాత అత్యధిక సంఖ్యలో మరణశిక్షలు అమలు చేస్తున్న దేశాల్లో రెండో స్థానంలో ఇరాన్‌ ఉంది. ప్రతీ సంవత్సరం వేలాది మందికి చైనా మరణశిక్షలు అమలు చేస్తుందనే ఆరోపణలు ఉన్నప్పటికీ.. వాటికి సంబంధించిన నిజమైన లెక్కలు మాత్రం ఎక్కడా అందుబాటులో లేవు.