ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ కేంద్రానికి కీలక ప్రతిపాదన చేసింది. రాష్ట్రంలో కొత్తగా 18 నగర వనాలను ఏర్పాటు చేయాలని కోరింది. అన్ని నియోజకవర్గాల్లో నగర వనాలు ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం దిశగా ఇప్పటికే పనులు జరిగాయి. ఇప్పటివరకు 54 నియోజకవర్గాల పరిధిలో 61 పార్కులకు అనుమతి లభించింది. వీటిలో 18 పార్కులను ఇప్పటికే ప్రజల కోసం ప్రారంభించారు. మరో 10 పార్కులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 33 చోట్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. కేంద్రం ఆమోదం తెలిపిన వెంటనే 11 జిల్లాల పరిధిలోని 14 నియోజకవర్గాల్లో ఈ పార్కులను ఏర్పాటు చేస్తారు. ఇది రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచే పెద్ద ప్రణాళికలో భాగమని చెబుతున్నారు అధికారులు.ఇప్పటివరకు మంజూరైన వాటికి అదనంగా, ఇప్పుడు మరో 18 నగర వనాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. ఈ కొత్త పార్కులను శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు అల్లూరి సీతారామరాజు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఒక్క నగరవనం కూడా ఏర్పాటు కాలేదు. ఈ జిల్లాల్లో నగర వనాల కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసి ప్రతిపాదనలపై కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని ఇటీవల అటవీశాఖ ఆయా జిల్లాల కలెక్టర్లను కోరింది. బాపట్ల, బాపట్ల జిల్లా చీరాల, శ్రీసత్యసాయి జిల్లా కల్యాణదుర్గం, చిత్తూరు జిల్లా కుప్పం, గజరామం, అనంతపురం, కడప జిల్లా బద్వేల్, కర్నూలు జిల్లా ఆదోని పట్టణం, కర్నూలు జిల్లా డోన్, శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ, శ్రీ సత్యసాయి ఎకోపార్క్‌లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ పార్కుల ద్వారా వాతావరణ కాలుష్యానికి చెక్ పెట్టొచ్చంటున్నారు అధికారులు. అందుకే ప్రభుత్వం ఈ నగర వనాలపై ఫోకస్ పెట్టింది. కేంద్రం సహకారంతో ప్రతి నియోజకర్గంలో ఈ పార్క్‌లను ఏర్పాటు చేసేలా ప్లాన్ చేసింది.