గంట పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చలు.. ఆ అంశంపైనా ప్రధానంగా చర్చ!

Wait 5 sec.

ఏపీ డిప్యూటీ సీఎం గత కొన్ని రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. జ్వరంతో పాటు దగ్గుతో పవన్ కళ్యాణ్ ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వైద్య పరీక్షల కోసం మంగళగిరి నుంచి హైదరాబాద్ వచ్చేశారు. అయితే ఐదు రోజులు గడుస్తున్నా పవన్ కళ్యాణ్ పూర్తిగా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా నాయుడు పవన్ కళ్యాణ్‌ను పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జ్వరం తగ్గినట్లు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు వివరించారు. అయితే దగ్గు అలాగే ఉన్నట్లు చంద్రబాబుకు వివరించారు. క్రానిక్ బ్రాంకైటిస్ వలన దగ్గు వస్తోందని, గొంతు దగ్గర నొప్పి కూడా ఉందని పవన్ కళ్యాణ్ వివరించారు.ఈ సందర్భంగా ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు సూచించారు. అలాగే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.మరోవైపు పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు సుమారుగా గంటపాటు పలు అంశాల గురించి చర్చించినట్లు తెలిసింది. మెగా డీఎస్సీ ద్వారా 15,941 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడం దగ్గర నుంచి.. అక్టోబర్ నాలుగో తేదీన ప్రారంభించే ‘ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం వరకూ ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. అలాగే స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలు చేయగలిగామని, ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతోందని చంద్రబాబు తెలిపారు. ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో.. ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని.. అక్టోబర్ 4 న విజయవాడలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వద్ద ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల కోసం ఆలోచన చేసిన ఈ పథకం అందరి మన్ననలు పొందుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.మరోవైపు అక్టోబర్ 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీకి రానున్నా సంగతి తెలిసిందే. కర్నూలులో రోడ్‌షోలో పాల్గొననున్నారు. జీఎస్టీ సంస్కరణలపై రోడ్ షో నిర్వహించనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలపైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలిసింది. ఏపీ పర్యటనలో భాగంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకోనున్నారు. జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించారు.