భారత్‌ vs పాక్‌ మ్యాచ్.. టాస్‌ కోసం వినూత్న ఏర్పాట్లు చేసిన నిర్వహకులు!

Wait 5 sec.

భారత్‌, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న ఆసియాకప్ 2025 ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. టాస్ సందర్భంగా ఇద్దరు వ్యాఖ్యాతలను నిర్వహకులు ఏర్పాటు చేశారు. దీంతో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యత అయిన రవిశాస్త్రి ఇంటర్వ్యూ చేశారు. అనంతరం పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్ యూనిస్.. పాక్ ప్రస్తుత కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో మాట్లాడాడు. మ్యాచ్ తర్వాత జరిగే ప్రెజెంటేషన్ సమయంలోనూ ఇదే ప్రోటోకాల్ కొనసాగుతుందని సమాచారం. క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారేమో. నిజానికి ఆసియాకప్ ప్రారంభం నుంచి పాకిస్థాన్ కెప్టెన్ లేదా ఇతర ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ భారత మీడియాను ఎదుర్కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు వారు సరైన రీతిలో బదులివ్వలేకపోతున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ సమయంలో ఇద్దరు వ్యాఖ్యాతలను నిర్వహకులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. నిజానికి పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా.. విలేకరులతో మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆసియాకప్‌ 2025లో భారత్‌తో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ తర్వాత ప్రెస్‌మీట్‌లో అతడు పాల్గొనలేదు. అతడికి బదులు హెడ్‌కోచ్‌ మైక్ హెస్సన్‌ మీడియా ముందుకు వచ్చాడు. ఇక యూఏఈతో మ్యాచ్‌కు ముందు కూడా పాకిస్థాన్ క్రికెట్.. ప్రెస్‌మీట్‌ను బహిష్కరించింది. సూపర్‌-4లో భారత్‌ చేతిలో ఓడిపోయిన తర్వాత పాక్ కెప్టెన్‌ ప్రెస్‌మీట్‌కు హాజరైనా.. కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాడు. నచ్చిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. కఠినమైన వాటిని పట్టించుకోలేదు. పాకిస్థాన్ కెప్టెన్‌ చేష్టలపై పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్‌ నఖ్వీ కూడా స్పందించాడు. దీనిపై మేం త్వరలో మాట్లడతాం.. అని దాటవేసే ప్రయత్నం చేశాడు. ఇక ఇదే సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ధైర్యంగా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నాడు. హ్యాండ్‌షేక్ వివాదంపై విలేకరులు ఇరుకున పెట్టే ప్రశ్నలు సంధించగా.. ఆత్మవిశ్వాసంతో బదులిచ్చాడు. కానీ పాకిస్థాన్ కెప్టెన్ మాత్రం ప్రశ్నలను తప్పించుకునేందుకు తమ దేశానికి చెందిన వ్యాఖ్యాతనే ఏర్పాటు చేయించుకున్నాడని నెటిజన్లు పేర్కొంటున్నారు.