ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. సోమవారం కూడా రాష్ట్రంలో వర్షాలు కొనసాగనున్నాయి. సోమవారం రోజున ఉత్తరాంధ్ర, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే బుధవారం నాటికి ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అటు ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. సహాయక చర్యల కోసం 2 ఎన్డీఆర్ఎఫ్, 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కృష్ణా, బాపట్ల, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కర్నూలు జిల్లాల్లో సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. మరోవైపు నదులలో వరద ప్రవాహం పూర్తి స్థాయిలో తగ్గేవరకు కృష్ణా, గోదావరి నదీ పరీవాహక లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని అప్రమత్తం చేసింది. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కర్నూలు వద్ద హంద్రీ నది పోటెత్తింది, దీంతో కర్నూలులోని చెంచుకాలనీ, దేవనగర్, బుధవారపేటలో కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద నీటి కారణంగా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీరం దాటిందని.. ఆదివారం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావంతో సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.మరోవైపు సముద్రం అలజడిగా ఉంటుందని.. ఈ నేపథ్యంలో బుధవారం వరకు చేపలవేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అప్రమత్తం చేసింది. మరోవైపు మంగళవారం అండమాన్‌ సమీపంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ ఒకటో తేదీ అల్పపీడనం ఏర్పడుతుందని వెల్లడించింది.