సత్తా చాటిన తిలక్ వర్మ.. ఆసియా కప్ ఫైనల్లో పాక్‌ను చిత్తు చేసిన భారత్

Wait 5 sec.

ఆసియాకప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్‌లో పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి 9వ సారి ఆసియాకప్ టైటిల్‌ను ముద్దాడింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో టీమిండియా విజయ ఢంకా మోగించింది. తొలుత పాకిస్థాన్‌ను 146 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. ఆ తర్వాత మరో బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఓ దశలో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్‌ను తిలక్ వర్మ విరోచిత పోరాటంతో గెలుపు గీత దాటించాడు.పాక్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తీవ్రంగా తడబడింది. సూపర్ ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ (5) రెండో ఓవర్‌లోనే ఔట్ అయ్యాడు. తర్వాతి ఓవర్‌లోనే సూర్యకుమార్ యాదవ్ (1).. కాసేపటికే గిల్ (12) కూడా ఔట్ అయ్యారు. దీంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో మరో వికెట్ పడితే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ సత్తా చాటాడు. తీవ్ర ఒత్తిడిని అధిగమించి.. కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి సంజూ శాంసన్ (21 బంతుల్లో 24 రన్స్‌) సహకరించాడు. అతడు ఔట్ అయిన తర్వాత శివమ్ దూబె (22 బంతుల్లో 33 రన్స్‌) కూడా సత్తాచాటాడు. చివరి వరకూ క్రీజులో ఉన్న తిలక్ వర్మ 53 బంతుల్లో 69 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. దీంతో టీమిండియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 19వ ఓవర్ చివరి బంతికి సిక్స్ కొట్టబోయిన దూబే క్యాచ్ ఔట్ కాగా.. ఆఖరి ఓవర్లో భారీ షాట్ బాదిన తిలక్ భారత్‌కు విజయాన్ని ఖాయం చేశాడు.ఈ విజయంతో భారత్.. ఆసియాకప్ చరిత్రలో 9వ సారి విజేతగా నిలిచింది. ఆసియాకప్ చరిత్రలో తొలిసారి ఫైనల్‌లో పాకిస్థాన్‌ తలపడ్డ భారత్.. జయభేరీ మోగించింది. దీంతో ఈ టోర్నీలో మొత్తంగా మూడోసారి ఆ జట్టుకు ఓటమి రుచిచూపించింది. లీగ్ స్టేజ్‌లో ఓసారి.. సూపర్‌-4లో రెండోసారి.. ఫైనల్‌లో మరోసారి చిత్తు చేసింది. పాక్‌పై విజయాల హ్యాట్రిక్ నమోదు చేసింది.