భారత్ - పాకిస్తాన్ మధ్య ఎలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయానోనని భయపడ్డారో అవన్నీ జరిగిపోయాయి. గ్రూప్ స్టేజ్ నుంచి ఫైనల్స్ వరకూ ఈ రెండు జట్లు మూడు సార్లు తలపడగా.. మూడు సార్లు కావాల్సినంత హీటు వచ్చింది. ముఖ్యంగా ఫైనల్స్ తర్వాత జరిగిన అవార్డ్స్ ఫంక్షన్ ఇరు దేశాల పరిస్థితులను మరింత హీటెక్కించాయి. ఏసీసీ ఛైర్మన్ అయిన పీసీబీ ఛైర్మన్, పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు టీమిండియా నిరాకరించింది. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా ముందుగానే తెలియజేసింది. అయినప్పటికీ నక్వీ వేదిక మీదకు వచ్చి పెద్ద సీన్ క్రియేట్ చేశాడు. నక్వీని అవమానించినందుకు పాకిస్తాన్ జట్టు కూడా గరంగరం అయింది. దాంతో అవార్డ్స్ ఫంక్షన్‌కు చాలా ఆలస్యంగా వచ్చిన పాక్.. అక్కడ కూడా అంతే విరుద్ధంగా ప్రవర్తించారు. పీసీబీ నుంచి వచ్చిన సలహాలు, సూచనలు మేరకు పాకిస్తాన్ కెప్టెన్ చర్య అందరికీ కోపం తెప్పించింది. ఆసియన్ క్రికెట్ కౌన్సెల్ (ఏసీసీ) రిప్రజంటీవ్ ఆమినుల్ ఇస్లాం అందించిన రన్నరప్ టైటిల్ చెక్కు తీసుకున్న పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా వెంటనే స్టేజ్ మీద నుంచి దాన్ని విసిరేశాడు. మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా టీమిండియా ఆసియా కప్ టైటిల్ అందుకోవడానికి ఇష్టపడకపోవడంతో.. తాము కూడా దీన్ని బహిష్కరిస్తున్నట్లు ఈ విధంగా చెప్పాడు. పాకిస్తాన్ ప్లేయర్లు గ్రౌండ్‌లోకి వచ్చినప్పటి నుంచి భారత్ ఫ్యాన్స్ ఒకటే ర్యాంగింగ్ చేస్తూనే ఉన్నారు."నిజంగా ఈ ఓటమిని మేం జీర్ణించుకోలేక పోతున్నాం. బ్యాటింగ్‌లో పూర్తి స్థాయిలో రాణించలేకపోయాం. బౌలింగ్ వైపు చూస్తే చాలా బాగా రాణించాం, వంద శాతం ప్రదర్శన ఇచ్చాం. కానీ చివరికి బ్యాటింగ్ కాస్తంత మంచి ఫినిషింగ్ చేసి ఉంటే కథ వేరేలా ఉండేదేమో. స్ట్రయిక్‌ని సరిగ్గా రొటేట్ చేయలేకపోయాం, ఆ సమయంలోనే వికెట్లు కోల్పోయాం" అని సల్మాన్ అలీ అఘా అన్నాడు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 19.1 ఓవర్లలో కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్ 57, ఫకర్ జమాన్ 46 పరుగులతో రాణించినా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్స్‌కే వికెట్లు కోల్పోవడంతో పాక్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయినా తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో 19.4 ఓవర్లలో విజయం సాధించింది.