ఏపీలో అంతరించిపోతున్న ఓ పక్షి జాడ కనిపెట్టడానికి రూ.50 కోట్లు ఖర్చు చేశారు. అవును మీరు వింటున్నది నిజమే.. ఆ పక్షి కోసం రూ.50కోట్లు ఖర్చు చేశారని సమాచారం. అత్యంత అరుదైన కలివికోడి పక్షిని వైఎస్సార్‌ కడప జిల్లాలోని శ్రీలంకమల్లేశ్వర అభయారణ్యంలో ఇటీవల గుర్తించారు. అంతరించిపోయిందని భావించిన ఈ పక్షిని, పక్షి పరిశోధక బృందం జులై, ఆగస్టు నెలల్లో వారాల తరబడి పరిశోధనలు చేసి కనిపెట్టారు. దీని కూతను కూడా రికార్డు చేశారు. ఈ కలివికోడి పక్షిని మొదట 1848లో పెన్నా నది దగ్గర చూశారు. ఆ తర్వాత చాలా కాలం కనిపించలేదు. 1985 జనవరి 5న రెడ్డిపల్లెకు చెందిన చిన్న ఐతన్న ఈ పక్షిని పట్టుకుని అటవీ అధికారులకు ఇచ్చారు. ఆ తర్వాత పక్షి శాస్త్రవేత్తలు ఈ జాతి అంతరించిపోయిందని చెప్పారు. 1998 నుంచి 2002 వరకు తిరుపతి SVU పరిశోధకులు దీని కోసం వెతికారు. 2002లో ముంబయి నేచురల్‌ హిస్టరీ సొసైటీ లంకమలలో దీని పాదముద్ర, కూతను రికార్డు చేసింది. వైఎస్సార్‌ కడప జిల్లా కొండూరు దగ్గర చిట్టడవుల్లో ఈ పక్షి జాడ కనిపించింది. అందుకే ప్రభుత్వం మూడు వేల ఎకరాల్లో శ్రీలంకమల్లేశ్వర అభయారణ్యాన్ని ఏర్పాటు చేసింది. ఇలా ఈ పక్షి ఉనికిని తెలుసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.50 కోట్లు ఖర్చు చేశాయి. ఈ పక్షి 27 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది.. ఈ పక్షి కూత దాదాపు 200 మీటర్ల దూరం వినిపిస్తుంది అంటున్నారు. ఈ పక్షులు ఎత్తైన ముళ్లపొదల్లో నివాసం ఉంటాయి.. ఎగరలేని కారణంగానే అక్కడే ఉంటాయి. పగటిపూట నిద్ర, రాత్రి ఆహార సేకరణ చేస్తాయి.. గులక రాళ్లను సేకరించి వాటి మధ్య గుడ్లు పెడతాయి. దశాబ్దాల క్రితం అంతరించిపోయిందని అంతర్జాతీయ పరిశోధక సంస్థలు భావించిన కలివికోడి, మూడు దశాబ్దాల కిందట సిద్దవటం రేంజి అటవీ ప్రాంతంలో మళ్ళీ కనిపించింది. శాస్త్రవేత్తలు, అటవీ అధికారులను ఆకర్షించిన ఈ పక్షి, కనిపించిన కొద్ది రోజులకే చనిపోయింది.