. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు రెండు సార్లు తలపడగా ఒకసారి హ్యాండ్ షేక్ రచ్చలేపగా, మరోసారి పహల్గాం సమయంలో చోటుచేసుకున్న ఘటనల హావభావాలతో పాక్ ఆటగాళ్లు భారత్‌ను రెచ్చగొట్టారు. అయితే, మరోసారి ఈ రెండు జట్లు ఫైనల్‌లో తలపడుతుండటంతో ఈసారి ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఐసీసీ స్ట్రిక్ట్ ప్లాన్ అమలు చేస్తోంది.ఈ మేరకు టీమిండియా కెప్టెన్ చేసిన పహల్గాం వ్యాఖ్యలపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విచారణ జరిపింది. ఆసియా కప్ 2025లో పాకిస్తాన్‌పై జరిగిన గ్రూప్ మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ ఆ విజయం భారత సైనికులకు అంకితం చేస్తూ, పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. ఈ వ్యాఖ్యలపై ఐసీసీ అధికారికంగా కేసు నమోదు చేయడంతో, దానికి సంబంధించిన విచారణలో సూర్యకుమార్ హాజరయ్యాడు.ఈ విచారణలో సూర్యకుమార్ యాదవ్‌తో పాటు బీసీసీఐ సీఓఓ హేమాంగ్ అమీన్, క్రికెట్ ఆపరేషన్స్ మేనేజర్ సమ్మర్ మల్లపుర్కర్ కూడా విచారణకు హాజరయ్యారు. ఈ విచారణకు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ రిచీ రిచర్డ్సన్ అధ్యక్షత వహించారు. విచారణ అనంతరం సూర్యకు హెచ్చరిక ఇవ్వడం లేదా మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఒక ఐసీసీ వర్గం తెలిపిన ప్రకారం.. "సూర్య విచారణకు హాజరయ్యాడు. రిచర్డ్సన్ అతనికి రాజకీయ స్వరూపం ఉన్న వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఇది లెవల్ -1 కిందకు వస్తుంది కాబట్టి శిక్షగా హెచ్చరిక లేదా 15 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా మాత్రమే ఉండే అవకాశం ఉంది" అని తెలిపింది. ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం, భారత్ - పాక్ సంబంధాలను మరింత దిగజార్చింది. ఈ నేపథ్యంలోనే సూర్యకుమార్ రెండు మ్యాచ్‌లలోనూ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. సెప్టెంబర్ 14న జరిగిన గ్రూప్ మ్యాచ్ గెలిచిన తరువాత “ఈ విజయం పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు అంకితం. భారత సైనికుల ధైర్యానికి వందనం. భవిష్యత్తులోనూ వారిని గర్వపడేలా చేస్తాం” అని తెలిపాడు. అంతేగాకుండా భారత్ ఫిర్యాదు మేరకు పాకిస్తాన్ ఆటగాళ్లు హారిస్ రవుఫ్, సాహిబ్‌జాదా ఫర్హాన్‌లపై కూడా ఐసీసీ విచారణ చేపట్టనుంది. ఫర్హాన్ ఇండియాతో జరిగిన సూపర్ -4 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన తరువాత ‘గన్ సెలబ్రేషన్’ చేయగా, రవుఫ్ ‘6 - 0’ సిగ్నల్ చేశాడు.