ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఊరట కల్పించింది. ఇకపై ఆదాయం, నివాసం, కులం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు రెవెన్యూ శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేస్తోంది. ఈ పత్రాల జారీలో అక్రమాలు, ప్రజల ఇబ్బందుల్ని గమనించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణలో ద్వారా కీలక అంశాలను గమనించింది. అందుకే దీనికి పరిష్కారంగా, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ సర్టిఫికెట్లను జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఇంటింటి సర్వే చేసి ప్రజల డేటాను సేకరించి, ధ్రువీకరణ పత్రాలను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తామని ఆర్టీజీఎస్‌, ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ తెలిపారు. అంటే ఆఫీసులకు వెళ్లకుండానే ఇంటికే ఈ పత్రాలన్నీ అందిస్తారు. అమల్లోకి వచ్చాక లబ్ధిదారులను, దరఖాస్తుదారులను మండల తహసీల్దారు కార్యాలయాలకు పిలవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో రెవెన్యూ శాఖను ఆదేశించారు. ఏపీలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారం ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్) దగ్గర ఉన్నందున వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించారు. ప్రతి మనిషికి పుట్టుకతో వచ్చిన కులం మారిపోదు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలని సూచించారు. ఆదాయానికి కూడా ఇదే విధానం వర్తిస్తుందని ఆయన తెలిపారు. ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించింది. అక్టోబరులో మరోసారి సర్వే చేసి ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను సేకరించి ఆర్టీజీఎస్‌కు అందజేస్తుంది. నవంబరు నుంచి ప్రజలు తమ ధ్రువీకరణ పత్రాలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ప్రజలకు మరింత సులువుగా సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రజలకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా సరే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అంటున్నారు. ప్రధానంగా, ఆదాయం, కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. గతంలో ఈ పత్రాల కోసం చాలా కష్టపడాల్సి వచ్చేది. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం 'సుమోటో' విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇంతకుముందు ధ్రువపత్రాలు కావాలంటే ప్రజలు దరఖాస్తు చేసుకోవాలి. కానీ ఇప్పుడు అధికారులు అవసరమైన పత్రాలను సుమోటోగా నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. మీసేవలో దరఖాస్తు చేసుకుంటే ఒక రోజులోనే పత్రాలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీలో అక్రమాలను అరికట్టడానికి సుమోటో విధానం ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికీ శాశ్వత సామాజిక ధ్రువపత్రం జారీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పత్రం జారీ అయ్యాక మళ్లీ కావాలంటే వాట్సాప్‌ మిత్ర లేదా ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా పొందే వీలు కల్పించారు.