ఆ జిల్లాపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. హెల్త్ రిసార్టులు, ఫైవ్‌స్టార్ రెస్టారెంట్లు.. రూపురేఖలే మారిపోతాయ్..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీలోని సుదూర తీర ప్రాంతం పర్యాటక రంగ అభివృద్ధికి ఊతంగా నిలుస్తోంది. దీనికి తోడు రాష్ట్రంలోన ఉన్న ఆధ్యాత్మిక, పర్యాటక, చారిత్రక, సందర్శనీయ ప్రాంతాలు వివిధ రాష్ట్రాల నుంచి సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎకో, టెంపుల్, అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి చేయాలనేది ఏపీ ప్రభుత్వం ప్రణాళిక. ఇక మన రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు ఎక్కువగా ఉన్న జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో టూరిజం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా సందర్శనకు రోజూ కనీసం లక్ష మంది పర్యాటకులు వస్తుంటారు. ఏటా సుమారుగా 730 కోట్ల వరకూ పర్యాటకరంగంలో వ్యాపారం జరుగుతోందని అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేస్తే.. సందర్శకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే పలు కీలక నిర్ణయాలను కూడా అధికారులు తీసుకున్నారు. అందులో భాగంగా పర్యాటకులు అధికంగా వచ్చే శ్రీశైలంలో ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్మించాలని ప్రతిపాదించారు. త్రీస్టార్ , ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్మించాలని నిర్ణయించిన అధికారులు.. ఇందుకోసం సున్నిపెంటలో 50 ఎకరాల స్థలాన్ని కూడా సిద్ధం చేశారు. భూ కేటాయింపులను త్వరగా పూర్తి చేసి.. 2026లో హోటల్స్ నిర్మాణ పనులను ప్రారంభించాలనేది అధికారుల ఆలోచన. ఇక శ్రీశైలం తర్వాత కర్నూలు జిల్లాలోని అహోబిలం ఆలయానికి కూడా సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అహోబిలం దేవాలయ అభివృద్ధికి కేంద్రం రూ.25 కోట్లు కేటాయించింది. ఈ నిధుల సాయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. సంగమేశ్వరంలో హైరేంజ్ హెల్త్ రిసార్టులు నిర్మించాలని ప్రతిపాదించారు.వీటితో పాటుగా బేతంచెర్లలోని బిల్లస్వర్గం గుహలు, ప్యాపిలిలోని వాల్మీకి గుహలను టూరిస్ట్ స్పాట్‌లుగా అభివృద్ధి చేయాలనేది మరో ఆలోచన. నంద్యాలలో దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలను ఏడు సర్క్యూట్లుగా విభజించి అభివృద్ధి చేయనున్నారు. ఓర్వకల్లులోని రాక్ గార్డెన్ అభివృద్ధి, కర్నూలులో శిల్పారామం నిర్మాణంపైనా దృష్టి సారించారు. ప్యాపిలి వెంగళంపాలెం చెరువు, డోన్ మండలం అప్పిరెడ్డిపాలెం చెరువులలో రెస్టారెంట్ల నిర్మాణానికి కూడా కసరత్తు జరుగుతోంది. కర్నూలులో 300 యూత్ టూరిస్ట్ క్లబ్బులు, నంద్యాలలో 78 యూత్ టూరిస్ట్ క్లబ్బులు ఏర్పాటు చేశారు. అలాగే కర్నూలు వెంకటరమణ కాలనీలోని హరిత హోటల్‌ను రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు.