వాట్సప్‌ గ్రూప్‌లో చేరిన పాపానికి రూ.64 లక్షలు గోవిందా.. మీరూ ఇలా చేస్తున్నారా..?

Wait 5 sec.

సైబర్ మాయగాళ్లు నిత్యం కొత్త పద్ధతుల్లో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఒక భారీ మోసంలో.. ఓ వ్యాపారిని వాట్సప్‌ గ్రూప్‌లో చేరి రూ.64 లక్షలు పోగొట్టుకున్నాడు. నకిలీ పెట్టుబడుల పేరుతో సదరు వ్యాపారిని నిండా ముంచారు. వివరాల్లోకి వెళితే.. న్యూ నల్లకుంటకు చెందిన ఒక వ్యాపారికి గత నెలలో 'నువామా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌'కు చెందిన అధ్యక్షురాలునంటూ ఒక మహిళ వాట్సప్‌లో పరిచయమైంది. ఆ తర్వాత ఆమె సహాయకుడిగా మరొకరు వ్యాపారికి టచ్‌లోకి వచ్చారు. రెండు రోజుల తర్వాత సుమారు 200 మంది సభ్యులు ఉన్న ఒక వాట్సప్‌ గ్రూప్‌లో వ్యాపారిని చేరమని కోరగా.. అతడు చేరాడు. ఆ గ్రూప్‌లో ఉన్న సభ్యులు తాము 'ఇనిస్టిట్యూషనల్‌ ఎకౌంట్‌' ద్వారా పెట్టుబడి పెట్టి భారీ లాభాలు పొందుతున్నట్టు చాటింగ్‌ చేయడం గమనించారు.వారి మాటలు నమ్మిన వ్యాపారి.. ఇచ్చిన గూగుల్‌ ఫామ్‌ లింక్‌ ద్వారా తన వివరాలు ఇచ్చి ముందుగా రూ. 50 వేలు డిపాజిట్‌ చేశారు. మరుసటి రోజు రూ. 1,265 లాభం వచ్చినట్టు చూపించి.. ఆ డబ్బును అతడి ఖాతాలో జమ చేశారు. ఇది నిజమని నమ్మిన ఆయన.. దఫాల వారీగా రూ. 24 లక్షలు చెల్లించి 3,81,300 షేర్లు కొనుగోలు చేసినట్టు సమాచారం అందుకున్నారు. ఈ విధంగా మొత్తం రూ. 64 లక్షలు షేర్లలో పెట్టుబడి పెట్టారు. రోజులు గడుస్తున్నా.. తాను పెట్టిన అసలు కానీ, వచ్చిన లాభం కానీ వెనక్కి తీసుకునే అవకాశం లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.సైబర్ మోసాల పట్ల జాగ్రత్త.. ఈ తరహా మోసాల్లో సైబర్‌ మాయగాళ్లు ఎక్కువగా నకిలీ కంపెనీల పేర్లు ఉపయోగిస్తుంటారు. నిజమైన, ప్రసిద్ధి చెందిన ఆర్థిక సంస్థల పేర్లను పోలిన నకిలీ పేర్లను ఉపయోగిస్తారు. నకిలీ పెట్టుబడిదారులతో నిండిన గ్రూప్‌లలో చేర్చి, నమ్మకం కలిగించడానికి నకిలీ లాభాల స్క్రీన్‌షాట్లు, మెసేజ్‌లు పంపుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వాట్సప్‌ లేదా టెలిగ్రామ్ ద్వారా తెలియని వ్యక్తులు పంపే పెట్టుబడి సందేశాలను, లింక్‌లను క్లిక్ చేయవద్దు. అపరిచిత గ్రూప్‌ల నుంచి వెంటనే బయటకు వచ్చేయాలి. ఏ పెట్టుబడి పథకంలోనూ రిస్క్ లేకుండా భారీ, తక్షణ లాభాలు రావు. అతిగా ఆశ చూపేవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టే ముందు సదరు కంపెనీ సెబీ (SEBI) వంటి గుర్తింపు పొందిన నియంత్రణ సంస్థల వద్ద రిజిస్టర్ అయి ఉందో లేదో అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేయాలి. బ్యాంక్‌ వివరాలు, OTPలు లేదా పత్రాలను ఎట్టిపరిస్థితిలోనూ అపరిచితులకు అందించవద్దు.మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోర్టల్ (1930) ద్వారా లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి.