ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు సూపర్ హిట్టు అవ్వగా.. బౌలర్లు మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఒకానొక దశలో రెండు ఓవర్లు మిగిల్చి మరీ శ్రీలంక 203 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేస్తుందని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా హర్షిత్ రాణా బౌలింగ్‌ని శ్రీలంక బ్యాటర్లు చీల్చి చెండాడారు. అదృష్టం కొద్దీ లో గెలిచినా.. టీమిండియా బౌలింగ్ దెబ్బకు కోచ్ మాత్రం తలపట్టుకుని కూర్చున్నాడు. పాకిస్తాన్‌తో ఫైనల్ పోరుకు ముందు జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ వైఫల్యం అందర్నీ కలవరపెట్టింది. పాక్ పేసర్లు ఫుల్ ఫామ్‌లోకి వస్తుంటే.. భారత బౌలర్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించుకుని విఫలమవుతున్నారు. బ్యాటింగ్ విభాగంలో మిడిలార్డర్ కూడా పటిష్టంగా తయారవ్వగా.. బౌలర్లు మాత్రం తేలిపోవడం ఫైనల్‌కు ముందు టీమిండియాకు వార్నింగ్ బెల్‌గా మారింది. శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో బుమ్రా, శివమ్ దుబేకి రెస్ట్ ఇచ్చిన టీమిండియా అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకుంది. ఈ ఇద్దరు బౌలర్లు పవర్ ప్లేలో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే, అర్షదీప్ సింగ్ డెత్ ఓవర్లలో రాణించి తన సమర్థతను నిరూపించుకున్నాడు. కానీ.. హర్షిత్ రాణా మాత్రం లైన్ మిస్సయ్యి ఎక్కువ పరుగులు ఇచ్చాడు. వీరికి తోడు అక్షర్ పటేల్ కూడా పరుగులు సమర్పించుకున్నాడు. హర్షిత్ రాణా ఏకంగా నాలుగు ఓవర్లలో 13.50 ఎకానమీతో 54 పరుగులు ఇచ్చాడు. అయితే, ఆఖరి ఓవర్‌లో నిశాంక వికెట్ తీసి జట్టును కాపాడాడు. ఇక అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 11.50 ఎకానమీతో 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్ దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లలో 31 పరుగుల చొప్పున ఇచ్చి చెరొక వికెట్ తీసుకున్నారు. అక్షర్ పటేల్ వికెట్లేమీ తీసుకోకుండా 32 పరుగులు బాదించుకున్నాడు. హార్దిక్ కేవలం ఒక్క ఓవర్ వేసి ఏడు పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. గాయం కారణంగా హార్దిక్ బయటకు వెళ్లడంతో టీమిండియా బౌలింగ్ విఫలమైంది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా పవర్ ప్లేలో బౌలింగ్ వేయకపోతే టీమిండియా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక మ్యాచ్ నిరూపించింది. బుమ్రాకి రెస్ట్ ఇచ్చిన ప్రతిసారీ భారత బౌలర్లు విఫలమవుతూనే వచ్చారు. ఇలాంటి బౌలింగ్ లైనప్‌తో ఆదివారం పాకిస్తాన్‌తో జరిగే ఫైనల్‌లో భారత్ బరిలోకి దిగితే.. పరిస్థితి ఏంటా అని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆందోళనలో ఉన్నాడు.