ట్రంప్ హెచ్ 1బీ వీసా ఫీజుల దెబ్బ.. అమెరికా వర్సిటీలకు కష్టాలు, రూ.కోట్లలో అదనపు భారం

Wait 5 sec.

అమెరికాలో పనిచేసే విదేశీ వృత్తి విద్యా నిపుణులు, ఇతర రంగాల వారికి అక్కడి కంపెనీలు ఇచ్చే హెచ్-1బీ వీసాల విషయంలో ఇటీవల అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సర్వత్రా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. హెచ్ 1బీ వీసాల ఫీజును ఏకంగా లక్ష డాలర్లు (సుమారు రూ. 88 లక్షలు) పెంచుతూ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం.. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే అత్యధికంగా హెచ్ 1బీ వీసాలతో అమెరికాలో ఉంటున్న భారతీయులపై ఇది మరింత ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నిర్ణయంతో కేవలం అమెరికా కార్పొరేట్ కంపెనీలకే కాకుండా.. అక్కడి ప్రముఖ యూనివర్సిటీలకు కూడా పెను సవాల్‌గా మారింది. ఇప్పటికే పరిశోధనల కోసం కేటాయించే ప్రభుత్వ నిధుల్లో కోత విధించడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న.. అమెరికా ప్రఖ్యాత యూనివర్సిటీలపై.. తాజా నిర్ణయం మోయలేని ఆర్థిక భారంగా మారుతోంది. సాఫ్ట్‌వేర్, ఆర్థిక కంపెనీల మాదిరిగానే.. అమెరికాలోని స్టేట్ యూనివర్సిటీలు, మెడికల్ స్కూల్స్, ఐవీ లీగ్ వంటి విద్యాసంస్థలు కూడా ప్రపంచ దేశాల్లోని ప్రతిభావంతులను నియమించుకోవడానికి హెచ్-1బీ వీసాలను జారీ చేస్తున్నాయి. ఇప్పుడు అవే హెచ్ 1బీ వీసాల ఫీజును అమెరికా ప్రభుత్వం భారీగా పెంచడంతో వారు తీవ్ర ఆందోళనలో పడ్డారు.బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. అమెరికాలో విద్యారంగానికి వస్తే మరే ఇతర విశ్వవిద్యాలయం కంటే ఎక్కువగా స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ హెచ్-1బీ వీసాల ద్వారా అంతర్జాతీయ నిపుణులను విధుల్లోకి తీసుకుంది. ప్రస్తుతం 500 మందికి పైగా సిబ్బందికి స్టాన్‌ఫోర్ట్ ఈ హెచ్ 1బీ వీసాలను జారీ చేసింది. ఈ యూనివర్సిటీ ప్రతీ సంవత్సరం సగటున 270 మందిని కొత్తగా విదేశీయులను నియమించుకుంటోంది. ఇప్పుడు భారీగా పెరిగిన వీసా ఫీజుల ప్రకారం చూస్తే.. ఒక్క స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయానికే ఏటా సుమారు 27 మిలియన్ డాలర్లు (అంటే మన భారత కరెన్నీలో రూ. 225 కోట్లు) అదనపు ఆర్థిక భారం కానుందని నిపుణులు చెబుతున్నారు.మరోవైపు.. హార్వర్డ్, కొలంబియా యూనివర్సిటీ, ది యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్, వాషింగ్టన్ యూనివర్సిటీ వంటి మరిన్ని ప్రముఖ సంస్థలు కూడా ఏటా వందల మంది విదేశీ సిబ్బందిని నియామకం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం జరుపుతున్నట్లుగా నియామకాలను కొనసాగిస్తే.. ఒక్కో విద్యాసంస్థపై ప్రతీ సంవత్సరం 10 మిలియన్ డాలర్ల నుంచి 20 మిలియన్ డాలర్లు ( అంటే రూ. 88 కోట్ల నుంచి 176 కోట్ల వరకు) అదనపు భారం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.అంతర్జాతీయ ప్రతిభను ఆకర్షించడంలో భాగంగా అమెరికా యూనివర్సిటీలు.. పరిశోధకులు, అధ్యాపకుల కోసం హెచ్-1బీ వీసాలపై ఆధారపడుతూ ఉంటాయి. ఇప్పటివరకు లాటరీ విధానం నుంచి విద్యాసంస్థలకు మినహాయింపు ఉండటం వల్ల.. విదేశీ నియామకాలు చేసుకునే యూనివర్సిటీలకు ఈ విధానం చాలా సులభంగా ఉండేది. అయితే కొత్తగా పెరిగిన ఫీజుల కారణంగా ఈ నియామకాలన్నీ అడ్డుకునే ప్రమాదం ఉందని.. అంతర్జాతీయ ప్రతిభావంతుల పూల్‌కు దారులు మూసుకుపోతాయని కాలిఫోర్నియాలోని ఒక ప్రొఫెసర్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.2023 లెక్కల ప్రకారం.. సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లోని పోస్ట్ డాక్టోరల్ సిబ్బందిలో 58 శాతం మంది హెచ్-1బీ వంటి తాత్కాలిక వీసాలపై ఉన్నవారేనని తేలింది. కొత్త విధానం వల్ల ముఖ్యంగా భారత్ వంటి దేశాల నుంచి ఉన్నత చదువుల కోసం వచ్చి.. చదువు పూర్తి అయిన తర్వాత అమెరికాలో స్థిరపడిపోవాలనే విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది.