ఆసియాకప్ 2025లో చివరి సూపర్-4 మ్యాచ్‌లో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. శ్రీలంకతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకూ వెళ్లింది. తొలుత ఇరు జట్లూ సరిగ్గా 202 రన్స్ స్కోరు చేశాయి. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం 2 రన్స్ మాత్రమే చేసింది. దీంతో భారత్ ముందు మూడు పరుగుల లక్ష్యం నిలిచింది. అనంతరం సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికే మూడు రన్స్ తీసి.. భారత జట్టుకు విజయాన్ని అందించాడు.ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61 రన్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తిలక్ వర్మ (49), సంజూ శాంసన్ (39) కూడా రాణించారు. అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన శ్రీలంక.. ఓ దశలో 12.1 ఓవర్లలో 134/1తో నిలిచింది. దీంతో ఈజీగా గెలిచేలా కనిపించింది. పతుమ్ నిసంక సెంచరీతో చెలరేగాడు. కానీ చివర్లో కుల్ దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి కట్టుదిట్టంగా బంతులేసి భారత్‌ను పోటీలోకి తెచ్చారు. చివరి ఓవర్‌లో శ్రీలంక విజయానికి 12 రన్స్ అవసరం కాగా.. హర్షిత్ రాణా కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో మ్యాచ్ టై అయింది.సూపర్ ఓవర్‌లో అర్షదీప్ సూపర్ బౌలింగ్..అనంతరం శ్రీలంక సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగింది. తొలి బంతికే కుశాల్ పెరీరా ఔట్ అయ్యాడు. ఐదో బంతికి శనక కూడా క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో 2 పరుగులకే శ్రీలంక ఇన్నంగ్స్ ముగిసింది. అనంతరం బరిలోకి దిగిన భారత్‌ను సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికే గెలిపించాడు. దీంతో పరాజయం లేకుండా భారత్.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ఇప్పటికే భారత్ ఫైనల్ చేరింది. సెప్టెంబర్ 28న అంటే ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియాకప్ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆసియాకప్ చరిత్రలో ఇప్పటివరకు 16 ఫైనల్స్ జరిగాయి. అయితే దాయాదుల మధ్య టైటిల్ పోరు జరగడం ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.