అమరావతిపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు సన్నిహితుడు కూడా..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం తాలూకూ చర్యలే కనిపిస్తున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారి 15 నెలలు కావొస్తున్నా కూడా రైతుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు.అమరావతి రైతుల సమస్యలపై చర్చించడానికి రెండు గంటల లసమయం కేటాయిద్దామని గత సమావేశాల సందర్భంగా స్పీకర్ చెప్పారన్న సుజనా చౌదరి.. అయితే ఆ సమయం మాత్రం ఇప్పటి వరకూ రాలేదని అభిప్రాయపడ్డారు. అందుకే అసెంబ్లీలో చర్చించడం లేదని తాను స్పీకర్‌కు మూడు పేజీల లేఖను కూడా రాసినట్లు సుజనా చౌదరి వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం పర్యావరణ పరంగా రాష్ట్రంలో అనేక తప్పులు చేసిందని సుజనా చౌదరి అన్నారు. మరోవైపు సుజనా చౌదరి ఒకప్పుడు టీడీపీలో కీలక నేతగా ఉన్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. అనుచరులుగా సుజనా చౌదరి, సీఎం రమేష్ గుర్తింపు పొందారు. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో వీరిద్దరూ బీజేపీలో చేరిపోయారు. మొత్తం నలుగురు టీడీపీ ఎంపీలు అప్పట్లో బీజేపీలో చేరారు. అనంతరం 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఊహించని విధంగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు సుజనా చౌదరి. అప్పటి వరకూ కేవలం రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ఆయన.. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన సుజనా చౌదరి.. గ్రాండ్ విక్టరీ కొట్టారు. ఇదిలా ఉంటే అమరావతికి టీడీపీ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తుందనేదీ తెలిసిన విషయమే. సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం అన్నారంటే రాజధాని నిర్మాణానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యం అర్థమవుతుంది. అలాగే అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రణాళికలు రచిస్తున్నారు. అమరావతి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, అమరావతి క్వాంటం వ్యాలీ, అమరావతి స్పోర్ట్స్ సిటీ అంటూ అనేక ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే వైసీపీ హయాంలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉద్యమించిన అమరావతి రైతుల పరిస్థితి మాత్రం.. అలాగే ఉందంటూ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరున్న సుజనా చౌదరి ఇలా అమరావతిని కూటమి ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం లేదన్నట్లుగా మాట్లాడటం సంచలనం రేపుతోంది.