అమరావతి ఓఆర్ఆర్‌పై మరో కీలక అప్ డేట్ వచ్చింది. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రచిస్తున్న ఏపీ ప్రభుత్వం..ఈ క్రమంలోనే అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మించేందుకు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అలాగే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు పలు మార్గాలను అనుసంధానించనున్నారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే చెన్నై- కలకత్తా నేషనల్ హైవేలో భాగంగా నిర్మాణం జరుగుతున్న వెస్ట్ బైపాస్‌తో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానించాలని ప్రణాళికలు రచించారు. ఈ నేపథ్యంలో చినకాకాని నుంచి తెనాలి వరకూ ఆరు లేన్ల రోడ్డును ప్రతిపాదించారు. మొత్తం 17,5 కిలోమీటర్ల మేరకు ఈ ఆరు వరుసల రహదారి నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. జాతీయ రహదారి.. పశ్చిమ బైపాస్ కలిసే చినకాకాని నుంచి తెనాలి వద్ద ఉన్న నందివెలుగు వరకూ.. దీనిని నిర్మించనున్నారు. నందివెలుగు వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుతో ఈ ఆరు లేన్ల రహదారిని అనుసంధానిస్తారు. ఈ అనుసంధానం ద్వారా హైదరాబాద్ నుంచి వచ్చే వారికి ప్రయాణం సులభతరం కానుంది. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనదారులు మీదుగా తెనాలికి వెళ్లొచ్చు. అలాగే ఓఆర్ఆర్ అనుసంధానంతో వేర్వేరు మార్గాలకు వెళ్లడానికి కూడా వీలు చిక్కుతుందని అధికారులు చెప్తున్నారు.మరోవైపు చినకాకాని నుంచి నందివెలుగు వరకూ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే డెల్టా వాసులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. డెల్లా వాసుల రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారుతాయని అధికారులు చెప్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశం దొరుకుతుందని చెప్తున్నారు.అలాగే తెనాలి నుంచి వెస్ట్ బైపాస్ మీదుగా గొల్లపూడి చేరుకోవచ్చు. ఇక తెనాలి నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి కూడా ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి. ఇక చుట్టు పక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డెల్టా ప్రాంతం నుంచి పంట ఉత్పత్తుల రవాణాకు కూడా అవకాశం ఉంటుందంటున్నారు. మరోవైపు అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు మాత్రమే కాకుండా అమరావతి రైల్వే లైన్ నిర్మాణం కూడా సంకల్పించారు. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలలో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలని భావిస్తున్న ప్రభుత్వం.. దేశంలోని ప్రధాన నగరాలతో అమరావతిని అనుసంధానం చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే అమరావతి రైల్వే లైన్, అమరాతి ఔటర్ రింగ్ రోడ్డు ఆలోచనలు చేశారు. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరును కలుపుతూ బుల్లెట్ రైలు ప్రతిపాదన కూడా తెరపైకి తెచ్చారు. మరి బుల్లెట్ రైలు ప్రతిపాదన కార్యరూపం దాలుస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.