తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 1.67 కోట్లకు పైగా గ్రామీణ ఓటర్లు పాల్గొననున్న ఈ ఎన్నికలను బహుళ దశల్లో నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. గ్రామ పంచాయతీ (సర్పంచ్, వార్డు సభ్యుల) ఎన్నికలను మూడు దశల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఈ మొత్తం ప్రక్రియ కోసం రూ. 350 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించగా.. ఇప్పటికే రూ. 3.08 కోట్లు విడుదలయ్యాయి.స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా రాష్ట్రంలోని 12,760 గ్రామ పంచాయతీలు, 1,12,534 వార్డులకు ప్రత్యక్షంగా ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 5,763 ఎంపీటీసీలు, 565 జడ్పీటీసీలకు కూడా ఓటింగ్ నిర్వహిస్తారు. అయితే, 565 మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులు (ఎంపీపీలు), 31 జిల్లాల జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్థానాలకు మాత్రం పరోక్షంగా ఎన్నిక జరగనుంది.గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం 11 గుర్తింపు పొందిన పార్టీలు, 31 నమోదు చేసుకున్న పార్టీలు తమ గుర్తులపై పోటీకి దిగనున్నాయి. దశలవారీగా పోలింగ్ వివరాలు చూసినట్లయితే.. మొదటి దశలో 41 మండలాల్లోని 1,098 గ్రామాలు, 9,324 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో దశలో 272 మండలాల్లోని 5,910 గ్రామాలు, 52,190 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. మూడో దశలో 252 మండలాల్లోని 5,752 గ్రామాలు, 51,020 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఎంపీటీసీ/జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి దశలో 290 జడ్పీటీసీలు, 2,977 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. రెండో దశలో 275 జడ్పీటీసీలు, 2,786 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం గ్రామీణ ఓటర్లు 1,67,03,168గా ఎన్నికల సంఘం గుర్తించింది. వీరిలో 85,36,770 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకాన్ని కూడా ఎస్ఈసీ ప్రారంభించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 651 మంది ఆర్వోలు, 2,337 మంది ఏఆర్‌వోలు సహా 1,98,258 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండు దశలకు కలిపి దాదాపు 2 లక్షల 7 వేల మంది సిబ్బంది పాల్గొంటారు. బ్యాలెట్‌ బాక్స్‌ల విషయానికి వస్తే, 1,72,916 బాక్స్‌లు అవసరం కాగా.. ఇప్పటికే 1,18,547 బ్యాలెట్‌ బాక్స్‌లను సిద్ధం చేశారు.