కొరివితో తల గోక్కుంటున్న ట్రంప్.. పాకిస్థాన్‌తో దోస్తీ.. అమెరికా పతనానికి నాంది!

Wait 5 sec.

సరిగ్గా 24 సంవత్సరాల క్రితం అమెరికాలో అల్ ఖైదా ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం మరిచిపోయినట్లున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 9/11 ఉగ్రదాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్‌.. పురిటిగడ్డ పాకిస్థానే అని కూడా గుర్తులేనట్లుంది. అందుకే ఉగ్రవాదానికి ఊపిరిపోసిన పాకిస్థాన్‌తో మళ్లీ దోస్తీకి సిద్ధమయ్యారు. ఈ మధ్య ఇస్లామాబాద్, వాషింగ్టన్ మధ్య విమానాలు అలుపులేకుండా తిరిగుతున్నాయి! తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను గొప్ప నేత, గొప్ప వ్యక్తి అని ఆకాశానికి ఎత్తేశారు ట్రంప్. అనంతరం షెహబాజ్ షరీఫ్‌, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను సాదరంగా ఓవల్ ఆఫీస్‌కు ఆహ్వానించి వారితో సమావేశమయ్యారు. మీడియాను కూడా అనుమతించకుండా.. రహస్య మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో పాక్‌తో అమెరికా ప్రేమాయణం భారత్‌ను రెచ్చగొట్టడానికేనా? ఉగ్రవాద దేశానికి అమెరికా అండగా ఉండటం దేనికి సంకేతం? ట్రంప్ చర్యలు అమెరికా పతనానికి నాంది పలికినట్లేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మళ్లీ చిగురిస్తున్న పాక్, అమెరికా దోస్తీ..పాకిస్థాన్, అమెరికా స్నేహం మళ్లీ చిగురిస్తోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. పాకిస్థాన్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ నవాజ్ షరీఫ్ ట్రంప్‌ను వేడుకుంటున్నారు. ఇరు దేశాల అధినేతలు తరచుగా కలుస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఆపరేషన్ సిందూర్ విషయంలో అమెరికా జోక్యం ఉందని.. ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్. ఇక ట్రంప్‌ను నోబెల్ బహుమతికి పాక్ నామినేట్ చేయడం ఇరు దేశాల మధ్య చిగురిస్తున్న పాత స్నేహానికి నిదర్శనంగా కనిపిస్తోంది. అయితే పాక్‌తో మలి దశ ప్రేమాయణం వెనుక.. అమెరికా వాణిజ్య ప్రయోజనాలతో పాటు భారత్, చైనాను కట్టడి చేసే వ్యూహాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.భారత్‌ను ఇబ్బంది పెట్టడానికేనా?ఇప్పటివరకు ఆసియాలో చైనాకు కౌంటర్ వెయిట్‌గా భారత్‌ను భావించింది అమెరికా. ఇండియాను ఉపయోగించుకుని చైనాకు చెక్ పెట్టాలని అనుకుంది. అందులో భాగంగా భారత్‌ను చెప్పుచేతల్లో పెట్టుకోవాలనుకుంది. కానీ భారత్ వ్యూహాత్మక స్వతంత్రతను పాటిస్తుండటం, రష్యాకు మరింత దగ్గరవడం, బ్రిక్స్ దేశాల్లో నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుండటం అమెరికాకు మింగుడుపడటం లేదు. దీంతో కొద్ది కాలంగా భారత్‌పై కత్తిగట్టినట్లు వ్యవహరిస్తోంది. టారిఫ్‌లు విధిస్తూ, భారత ప్రయోజనాలను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా భారత్ బద్ధ శత్రువు పాకిస్థాన్‌ను పావులా వాడుకుని.. ఇండియాను ఇబ్బంది పెట్టడానికి అడుగులు వేస్తోంది అమెరికా. కేవలం పాకిస్థాన్‌ మాత్రమే కాదు.. బంగ్లాదేశ్‌నూ తన కంట్రోల్‌లో పెట్టుకుని.. ఈ రెండు దేశాలను భారత్‌కు పక్కలో బల్లెంలా అమెరికా తయారు చేస్తోంది. అందుకోసమే పాక్, బంగ్లా మధ్య దూరం తగ్గించేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే భారత్ అనుకూల షేక్ హసీనాను అమెరికా గద్దె దింపేలా చేసిందనే వాదనలూ ఉన్నాయి. వాణిజ్యం సహా ఇతర విషయాల్లో భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు పాక్‌తో దోస్తీ చేస్తోంది అమెరికా. భారత్ తన మాట వినకుంటే.. పాకిస్థాన్‌కు ఎక్కువగా సపోర్ట్ చేస్తూ బెదిరిస్తోంది. ఇక దక్షిణాసియాలో భారత్ ఇన్‌ఫ్లూయెన్స్‌ను తగ్గించడానికి పాక్‌కు మద్దతు ఇస్తోంది. పాకిస్థాన్‌తో భారత్ పక్కలో బల్లెంలా పొడుస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగించడం కూడా అమెరికా వ్యూహంలో భాగమే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా అమెరికా అనేక సార్లు భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌ను వాడుకుంది. గతంలోనూ పాకిస్థాన్‌‌ను పావులా వాడిన అమెరికా..అమెరికా, సోవియెట్ యూనియన్ కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో.. భారత్ సోవియెట్ వైపు మొగ్గు చూపింది. దీంతో పాకిస్థాన్‌ను SEATO, CENTO (కోల్డ్ వార్ సమయంలో ఉన్న మిలిటరీ కూటమిలు)లో జాయిన్ చేసుకుంది అమెరికా. అనంతరం పాక్‌కు బిలియన్ల కొద్దీ మిలిటరీ, ఆర్థిక సహాయం అందించింది. దీంతో భారత్‌తో కవ్వింపులకు దిగింది పాకిస్థాన్. 1965, 1971 ఇండో-పాక్ యుద్ధాల్లో కూడా అమెరికా అందించిన ఆయుధాలనే భారత్‌పైకి ఉపయోగించింది పాకిస్థాన్. 1975 బంగ్లాదేశ్‌ స్వతంత్ర్య సమయంలో బంగ్లాకు భారత్ మద్దతు ఇచ్చింది. దీంతో పాక్ మిలిటరీ నియంత యహ్యా ఖాన్‌కు అమెరికా మద్దతు తెలిపింది. ఆ యుద్ధంలో పాక్ సైన్యంతో భారత్ పోరాడుతుంటే.. ఇండియాను బెదిరించడానికి బంగాళాఖాతంలోకి సెవెంత్ ఫ్లీట్ యూఎస్ఎస్ ఎంటర్‌ప్రైజ్‌ను పంపించింది అమెరికా. కోల్డ్ వార్ తర్వాత రష్యాతో భారత్ సంబంధాలు కొనసాగించింది. ఈ క్రమంలో పాకిస్థాన్‌పై న్యూక్లియర్ ఆయుధాల విషయంలో అమెరికా ఆంక్షలు విధించింది. అయితే 1999లో కార్గిల్ యుద్ధం సమయంలో ఇండియాపై ఒత్తిడి తీసుకురావడానికి పాకిస్థాన్‌కు మద్దకు తెలిపింది అమెరికా. మొత్తంగా భారత్‌ను నిలువరించడానికి పాకిస్థాన్‌ను ఒక లీవర్‌లా వాడుకుంది అమెరికా. భారత్ దక్షిణాసియాలో ప్రభావవంతంగా మారినా, రష్యా వైపు మొగ్గుచూపినా.. పాకిస్థాన్‌ను ఉపయోగించుకుని ఒత్తిడి చేస్తోంది అమెరికా. ఒకవేళ అమెరికాతో ఇండియా సఖ్యంగా ఉంటే.. పాకిస్థాన్‌తో తమకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తోంది. కానీ పూర్తిగా సంబంధాలు తెగదెంపులు చేసుకోవడం లేదు. ఉగ్రవాద దేశానికి అమెరికా అండ.. ఇది దేనికి సంకేతం?ఉగ్రవాదానికి బహిరంగంగానే పాకిస్థాన్ సపోర్ట్ చేస్తోంది. తాలిబాన్, హక్కాని నెట్వర్క్, లష్కరే తోయిబా, అల్ ఖైదా వంటి అనేక ఉగ్రవాద సంస్థలకు కేంద్రంగా ఉంది పాకిస్థాన్. 9/11 అమెరికా ట్రేడ్ సెంటర్ దాడి, 2008 ముంబయి పేలుళ్ల వెనుక ఉన్నది లష్కరే తోయిబా అని అమెరికాకు కూడా తెలుసు. అయితే కొన్ని సందర్భాల్లో అమెరికాకు ఇంటెలిజెన్స్ అందించి పాక్ సహాయం చేసింది. ఇలా రెండు రకాలుగా అమెరికాతో పాకిస్థాన్ వ్యహరిస్తోంది. పాక్ ఇలా చేయడం వల్ల ప్రమాదం ఉందని తెలిసినా.. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతం.. తమ ప్రయోజనాలకు కీలకం అని అమెరికా భావిస్తోంది. కేవలం స్వప్రయోజనాలే తప్ప విలువలు అమెరికా అస్సలు పాటించదని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఓ వైపు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామంటూనే.. ఉగ్రవాద దేశంతో దోస్తీ చేస్తోంది అమెరికా. ఈ రెండు దేశాల సంబంధాలను పరిశీలిస్తే.. అమెరికాకు పాకిస్థాన్ స్నేహితుడికి తక్కువ, లీవర్‌కి ఎక్కువగా కనిపిస్తోంది. అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటూ.. అప్పుడప్పుడూ ఉగ్రవాదం రూపంలో చూరకలు కూడా అంటించుకుంటోంది అమెరికా. అయినా పాకిస్థాన్‌కు ఉన్న వ్యూహాత్మక ప్రాముఖ్యత వల్ల ఆ దేశాన్ని వదులుకోవట్లేదు. ముస్లిం దేశాల్లో పాక్‌ వద్ద మాత్రమే అణ్వాయుధాలు ఉన్నాయి. పరిస్థితులు చేజారితే అమెరికా వైపే ఆ ఆయుధాలు గురిపెట్టే ప్రమాదం ఉంది. ఇది అమెరికా కొరివితో తల గోక్కున్నట్లే. ఇప్పుడు పరిస్థితులు అమెరికాకు వ్యతిరేకంగా మారుతున్నాయి. భారత్, చైనా ఎదుగుదలతో యూఎస్ ఆధిపత్యానికి గండిపడుతోంది. బ్రిక్స్ కూటమి బలపడటం అమెరికాకు డైరెక్ట్ సవాల్. ఈ పరిస్థితుల్లో గతంలో జరిగినట్లు పాక్‌ను ఉపయోగించుకుని భారత్‌కు చెక్ పెట్టడం అమెరికాకు కుదరదు. అలా చేస్తే భారత్ కూడా దానికి ప్రతివ్యూహాలు పన్నుతుంది. మల్టీపోలార్ వరల్డ్‌ అనివార్యమైన క్రమంలో ఇకపై అమెరికా పాచికలు అంతగా చెల్లవనేది నిపుణులు మాట.