బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఒడిశాలోని గోపాల్‌పుర్‌ వద్ద శనివారం ఉదయం తీరం దాటిన ఈ వాయుగుండం.. నేడు దక్షిణ ఒడిశా-ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. వాయుగుండం కేంద్రం నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర, గోవా వరకు 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని చెప్పారు. దీని ప్రభావంతో నేడు రేపు, తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వికారాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం కురిసే సమయంలో అత్యవసరం అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లొద్దని సూచించారు. ఇక ఇక శనివారం అత్యధికంగా వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేటలో 15.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు మెదక్ జిల్లా లింగాయిపల్లిలో 10.4 సెం.మీ., సంగారెడ్డి జిల్లా మానూరులో 9.2, వరంగల్ జిల్లా మేడిపల్లిలో 9.1, ఆసిఫాబాద్‌లో 6.1 సెం.మీ. వర్షం కురిసింది.రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలకు దాల్చింది. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా గరిష్ఠస్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎంజీబీఎస్, చాదర్‌ఘాట్, మూసారంబాగ్‌ పరిసరాల్లోని మలక్‌పేట్‌ నియోజకవర్గం పరిధిలో 10 కాలనీలు, అంబర్‌పేట్‌లో రెండు కాలనీలు నీట మునిగాయి. దాదాపు 2వేల ఇళ్లు వరదలో చిక్కుకున్నాయి. ఎంజీబీఎస్‌ వద్దనున్న రెండు వంతెనలు, నార్సింగిలోని మంచిరేవుల కాజ్‌వే, చాదర్‌ఘాట్‌ లో లెవల్, మూసారంబాగ్, గౌరెల్లి వద్ద వంతెనలపై నుంచి నీరు ప్రవహించడంతో శనివారం రాకపోకలకు పూర్తిగా అంతరాయం కలిగింది. దీంతో హైదరాబాద్ నగరం ట్రాఫిక్‌ చక్రబంధంలో చిక్కుకుపోయింది.మరోవైపు ఈ నెల 30 నాటికి ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడవచ్చని, దీని ప్రభావంతో అక్టోబరు 1 నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది కూడా వర్షాల తీవ్రతను పెంచే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.