గాయంతో యాషెస్ సిరీస్‌కు దూరమైన ఇంగ్లాండ్ పేసర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు సోమవారం సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఇటీవల భారత్‌తో జరిగిన అండర్సన్, సచిన్ టెండూల్కర్ ట్రోఫీలో క్రిస్ వోక్స్.. ఐదు టెస్ట్‌లు ఆడాడు. అయితే చివరి టెస్ట్‌లో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. ఎడమ భుజం పక్కకు జరగడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అయినా జట్టు కష్టాల్లో ఉందని.. ఒంటిచేత్తో బ్యాటింగ్ చేసేందుకు వచ్చాడు. దీంతో తన పోరాటంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు 36 ఏళ్ల వోక్స్. నిజానికి క్రిస్ వోక్స్.. ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ సిరీస్‌లో ఆడాలని అనుకున్నాడు. కానీ గాయం తిరగబెట్టడంతో.. సకాలంలో కోలుకోలేకపోయాడు. కెరీర్ ఆద్యాంతం గాయాలతో ఇబ్బంది పడ్డ ఈ పేసర్.. చివరకు గాయాలతో వేగలేక అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు! “అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చేసింది. ఇంగ్లాండ్ తరఫున ఆడాలనేది నా చిన్నప్పటి డ్రీమ్. నా కలను నిజం చేసుకున్నందుకు నిజంగా నేను అదృష్టవంతుడిని. ఇంగ్లాండ్‌ క్రికెట్ జట్టు తరఫున బరిలోకి దిగడం.. మూడు సింహాలు ముద్రించి ఉన్న జెర్సీని ధరించడం.. గత 15 ఏళ్లుగా సహచరులతో మైదానంలో గడపడటం మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చాయి. తోటి ఆటగాళ్లలో చాలామంది నాకు జీవితకాల స్నేహితులుగా మారిపోయారు. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్‌, కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నా,” అని క్రిస్ వోక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. కాగా క్రిస్ వోక్స్‌.. ఆస్ట్రేలియాపై 2011లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మొత్తంగా రెడ్‌బాల్ క్రికెట్‌లో 62 మ్యాచుల్లో 192 వికెట్లు తీశాడు. విదేశాల్లో కంటే స్వదేశంలోనే అతడు సత్తాచాచాడు. ఇంగ్లాండ్ గడ్డపైనే టెస్టుల్లో 148 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 36 ఏళ్ల క్రిస్ వోక్స్.. ఇంగ్లాండ్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 217 మ్యాచ్‌లు ఆడి 396 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ 2019 వన్డే ప్రపంచకప్‌, 2022 టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినప్పటికీ.. కౌంటీ క్రికెట్ కొనసాగిస్తానని, ఫ్రాంఛైజీ క్రికెట్‌లో అవకాశాలను అన్వేషిస్తానని క్రిస్ వోక్స్ తెలిపాడు.