భారత్ - పాకిస్తాన్‌లు మూడుసార్లు తలపడటంతో ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో డ్రామా నడిచింది. హ్యాండ్ షేక్ వివాదం దగ్గర నుంచి ఆపరేషన్ సిందూర్.. ఇక చివరికి .. ఇలా ఆద్యంతం నాటకీయంగా మారింది. అయితే, ఇప్పుడు తాజాగా మరో హై డ్రామా తెరపైకి వచ్చింది. టీమిండియాకు ట్రోఫీ అందించడానికి ఏసీసీ చీఫ్, పీసీబీ ఛైర్మన్ సిద్ధంగా ఉన్నాడనే వార్త వైరల్ అవుతోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ భారత జట్టుకు ట్రోఫీ, పతకాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పారంట. అయితే, దానికి ఒక కండీషన్ కూడా ఉందని.. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఒక ఫార్మల్ ఫంక్షన్ నిర్వహించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారంట. మరి ఇది ఎంతవరకు నిజమో? అసలు జరుగుతుందా? లేదా? అనేది చూడాలి మరీ! ఫైనల్‌లో పాకిస్తాన్‌ను భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. అయితే పాకిస్తాన్ మంత్రిగా ఉన్న ఏసీసీ చీఫ్ మొహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి భారత్ నిరాకరించింది. రాజకీయ నేపథ్యంతో పాటు తరచూ భారత్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న కారణంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ కూడా స్పష్టం చేసింది. అయితే, యూఏఈ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఖలీల్ అల్ జరూనీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు బీసీసీఐ ముందుగానే వెల్లడించింది. అయినా కూడా ఆ ట్రోఫీని తానే ఇవ్వాలని నక్వీ పట్టుదల పట్టడంతో గ్రౌండ్‌లోనే పెద్ద హై డ్రామా నడిచింది. నక్వీ చేతుల మీదుగా తీసుకునేందుకు ఇష్టపడని భారత్ ఏకంగా గంట పాటు గ్రౌండ్‌లోనే ఉండిపోయింది. చివరకు ఆగ్రహంతో నక్వీ స్టేడియం నుంచి ట్రోఫీతో సహా వెళ్లిపోయాడు. నక్వీ వెళ్లగానే టీమిండియా కూడా ట్రోఫీ లేకుండానే సెలబ్రేషన్స్ చేసుకుంది. ట్రోఫీ ఎత్తినట్లు, ట్రోఫీతో ఉన్నట్లు ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ అయ్యాయి. నక్వీ తీరుపై బీసీసీఐ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబర్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో ఈ అంశాన్ని అధికారికంగా లేవనెత్తేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.