'కష్టపడితే ఏదైనా సాధ్యమే' అని మరోసారి నిరూపించింది తెలంగాణ పేదింటి బిడ్డ. నిరుపేద కుటుంబ నేపథ్యం, కష్టాలు వెంటాడినా.. వాటన్నింటినీ చదువు అనే ఆయుధంతో అధిగమించి రాష్ట్ర అత్యున్నత సర్వీసు అయిన గ్రూప్ 1 ఉద్యోగం సాధించింది. '.' అనే మాటను నిజం చేసింది. ములుగు జిల్లాలోని జేడీ మల్లంపల్లి గ్రామానికి చెందిన మౌనికది నిజంగా కష్టాల జీవితం. మౌనిక తల్లి సరోజ కూలీ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేవారు. తండ్రి సమ్మయ్య గ్రామంలో ఒక చిన్న పంక్చర్‌‌ షాపు నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, తమ కూతురు చదువుకు వారు అడ్డు చెప్పలేదు. వారి శ్రమ, త్యాగాలను చూసిన మౌనిక.. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి తమ తల్లిదండ్రులకు గొప్ప జీవితాన్ని ఇవ్వాలని చిన్ననాడే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే చదువును కొనసాగించింది. 2020లో డిగ్రీ పూర్తి చేసిన మౌనిక.. ఆ తర్వాత ఉద్యోగ సాధనపైనే పూర్తి దృష్టి సారించింది. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో, పెద్ద మొత్తంలో ఫీజులు కట్టి కోచింగ్‌ తీసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో సొంతంగానే ప్రిపరేషన్ మెుదలు పెట్టింది. ఇంట్లోనే చదువుకుంటూ గ్రూప్‌‌-1 పరీక్షకు సన్నద్ధమైంది. స్వీయ అధ్యయనం, నిరంతర కృషి, పట్టుదలతో చదివి.. తాజాగా విడుదలైన గ్రూప్‌‌-1 ఫలితాల్లో 315వ ర్యాంక్‌‌ సాధించింది. ఈ ర్యాంకు ద్వారా ఆమె డీఎస్పీ పోస్టుకు ఎంపికైంది.కూలీ పనులు చేస్తూ, పంక్చర్‌‌ షాపు నడుపుతూ కష్టాలు పడిన తల్లిదండ్రుల ముఖంలో ఈరోజు మౌనిక విజయం వెలుగులు నింపింది. కోచింగ్‌ లేకుండానే రాష్ట్ర అత్యున్నత సర్వీసులో సత్తా చాటి డీఎస్పీగా ఎంపికైన మౌనిక పట్టుదలకు, కష్టానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఆమె ఈ విజయం ఎందరో పేద, మధ్యతరగతి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా మౌనికను పలువురు గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఏ తల్లిదండ్రులకైనా ఇలాంటి కూతురు ఉండాలని కొనియాడుతున్నారు.