ప్రజలకు దసరా, దీపావళి కానుక.. నవంబర్ నుంచి ఛార్జీల తగ్గింపు, ఎంత తగ్గిస్తున్నారో తెలుసా!

Wait 5 sec.

జీఎస్టీ సంస్కరణలు, తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు ప్రజలకు మేలు చేస్తాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సంస్కరణలు, సమర్థవంతమైన వ్యవస్థల నిర్వహణతోనే ఇది సాధ్యమైందని.. గతంలో ట్రూ అప్ ప్రతిపాదనలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు తొలిసారి ట్రూ డౌన్ వచ్చిందన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో దాదాపు రూ. వెయ్యి కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నాశనం చేసిందని.. ఎక్కువ ధరకు విద్యుత్ కొనడం వల్ల ప్రజలపై భారం పడిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టిందని.. రాష్ట్ర విద్యుత్ అవసరాలను ముందుగానే సమీక్షించి, తక్కువ ధరకు కొనుగోళ్లు చేపట్టామన్నారు. ఈ చర్యల వల్ల ప్రజలపై భారం తగ్గిందన్నారు.కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ, విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నట్లు విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నవంబర్ నెల నుంచి ప్రతి యూనిట్‌పై 13 పైసలు తగ్గుతుందని.. జగన్ ప్రభుత్వం ప్రజలపై మోపిన భారాన్ని తమ ప్రభుత్వం తగ్గిస్తోందన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు మరింత భారం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. 2019లో తెలుగు దేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా చంద్రబాబు తీర్చిదిద్దారన్నారు. కానీ జగన్ వచ్చాక 5 ఏళ్లలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారు. రూ.1.25 లక్షల కోట్ల మేర అప్పులు ఊబిలోకి నెట్టారన్నారు. గత ప్రభుత్వం 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిందన్నారు.5 ఏళ్లు సీఎంగా ఉండి జెన్కో, ట్రాన్స్‌కో వ్యవస్థలను జగన్ నాశనం చేశారు. వీటీపీఎస్, కృష్ణపట్నంలో విద్యుత్ తయారు చేసుకునే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. బయటి రాష్ట్రాల నుంచి ఎక్కువ ఖర్చు చేసి విద్యుత్ కొనుగోలు చేశారు. 2019కు ముందు రెన్యువబుల్ ఎనర్జీలో ఏపీ ముందుంది. 7 నుంచి 9 వేల మెగావాట్లపై చిలుకు విద్యుత్ ఉత్పత్తి చేశాం. కానీ జగన్ వచ్చాక కక్ష సాధింపులతో పీపీఏలు రద్దు చేశారు. ఒప్పందం చేసుకున్న విద్యుత్‌ను వాడకపోవడంతో రూ.9 వేలకోట్లు ఆ సంస్థలకు అప్పనంగా చెల్లించాల్సి వచ్చింది. ఆ భారమంతా ప్రజలపైనే పడింది. కేంద్రం ఇచ్చే రాయితీ పథకాలను కూడా వినియోగించుకోలేదు. వీటీపీఎస్ కు బొగ్గు సరఫరా చేసి నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి చేయాలని 70 శాతం వినియోగంలోకి తెచ్చాం. 90 శాతం మేర విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రయత్నం చేస్తాం. కృష్ణపట్నం, కడపలోని ప్లాంట్లను కూడా వినియోగంలోకి తెస్తాం. విద్యుత్ కొనుగోలు తగ్గించాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం. గత ప్రభుత్వంలో 17 శాతం పైన ఉండే షార్ట్ టర్మ్ విద్యుత్ కొనుగోలును 6.8 శాతానికి తగ్గించాం. శ్వాపింగ్ విధానం ద్వారా అవసరమైనప్పుడు మాత్రమే రాజస్థాన్, హర్యాన రాష్ట్రాల నుంచి పవర్ తీసుకుంటున్నాం. విద్యుత్ రంగంలో సీఎం చంద్రబాబుకు అపారమైన అనుభవం ఉంది. దేశంలో మొదటిసారి సంస్కరణలు తెచ్చిన వ్యక్తి సీఎం చంద్రబాబు’ అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 2021-22లో రూ.3 వేల కోట్లు, 2022-23లో రూ.6,073 కోట్లు, 2023-24లో ప్రొవిజనల్ కలెక్షన్ అంటూ రూ.9,300 కోట్లు భారం వేశారు. ప్రతి యూనిట్‌పై అదనంగా 40 పైసలు భారం వేశారు. మొత్తం మీద ఐదేళ్లలో ప్రజల నెత్తిన రూ.18 వేల కోట్లకు పైగా విద్యుత్ భారం మోపారు. ప్రస్తుతం ట్రూడౌన్ ద్వారా 13 పైసలు తగ్గించాం. 2019లో మేం దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ ఉంచాం. కానీ జగన్ దిగిపోయే నాటికి విద్యుత్ వ్యవస్థను నాశనం చేశారు. విపరీతమైన భారాలు వేశారు. సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నా రాజస్థాన్‌ నుంచి 9 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేశారు. ఇవన్నీ బిల్లుల రూపంలో ప్రజలపై భారం పడింది. ఇష్టానుసారంగా విద్యుత్ కొనుగోలుపై ఖర్చు చేశారు. గత ప్రభుత్వం విధించిన ట్రూ అప్ ఛార్జీలతో చిన్న పరిశ్రమలదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రతి 10 రోజులకు ఒకసారి సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖపై సమీక్ష చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఛార్జీల భారం తగ్గుతుంది. ఈ తగ్గింపులు ప్రజలకు భారం లేకుండా చేయడంతో పాటు పరిశ్రమల రాకకు ఊతమిస్తాయి’ అని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. 'రాష్ట్రంతో పాటు అమరావతి రాజధాని భవిష్యత్‌ను దృష్టిపెట్టుకుని సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. రాయల సీమలో విండ్, సోలార్ పవర్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. బ్యాటరీ స్టోరేజీకి (BESS)కూడా అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. పగటిపూట విద్యుత్ ఉత్పత్తి చేసి బ్యాటరీల ద్వారా నిల్వ చేసి రాత్రిపూట పీక్ సమయాల్లో వినియోగించుకునే అవకాశం ఉంది. వీటి ఏర్పాటుకు సంబంధించి టెండర్లు కూడా పూర్తయ్యాయి. పీ ఎస్ పీ లకు ప్రకాశం జిల్లాలో టెండర్లు కూడా పిలిచాం. గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను ఆదాయ వనరుగా మార్చుకుంది' అని మంత్రి విమర్శలు చేశారు.