తెలంగాణ ప్రజలకు బిగ్ రిలీఫ్. దంచికొడుతున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తాజాగా.. తెలంగాణ వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం పూర్తిగా తగ్గిపోవడం, తెలంగాణ ప్రాంతం నుండి దూరంగా వెళ్లడంతో.. నేటి నుంచి వర్షాలు తగ్గే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో సాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా పెద్దగా వర్షాలు ఉండే అవకాశం లేదు. ఉదయం పూట ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఉండే అవకాశం ఉంది. అయితే.. మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రం వేళల్లో హైదరాబాద్ నగరంతో సహా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా స్వల్ప వర్షాలు కురిసే అవకాశం ఉంది. జల్లులు మాత్రమే కురుస్తాయని భారీ వర్షానికి అవకాశం లేదని అన్నారు. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రం 5-10 నిమిషాల పాటు చిరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కానీ భారీ వర్షాలకు మాత్రం ఎలాంటి అవకాశం లేదని చెప్పారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నా.. అవి భారీగా కురిసే అవకాశం లేదని చెప్పారు. మొత్తంగా సాయంత్రం వరకు పొడి వాతావరణం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రమాదకర స్థాయికి చేరిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి గణనీయంగా తగ్గింది. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయాలకు వస్తున్న ఇన్‌ఫ్లో తగ్గడంతో అధికారులు అవుట్‌ఫ్లోను తగ్గించారు. శుక్రవారం రాత్రి అత్యధికంగా 36 వేల క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేయగా.. ప్రస్తుతం ఆ మొత్తం భారీగా తగ్గింది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి కలిపి 4,847 క్యూసెక్కుల నీటిని మాత్రమే మూసీలోకి విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ ఇన్‌ఫ్లో 1100 క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ఫ్లో 884 క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్ సాగర్ ఇన్‌ఫ్లో 4,000 క్యూసెక్కులు ఉండగా.. అవుట్‌ఫ్లో 3,963 క్యూసెక్కులుగా ఉంది. జంట జలాశయాల నుంచి నీటి విడుదల తగ్గడంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇళ్లలోకి చేరిన బురదను, వరద నీటి తాలూకు అవశేషాలను శుభ్రం చేసుకునే పనిలో వారు నిమగ్నమయ్యారు. వర్షాలు తగ్గడం, వరద ఉధృతి తగ్గడంతో వారిలో ఆందోళన కొంత తగ్గింది.