స్థానిక సంస్థల ఎన్నికలో 42 శాతం రిజర్వేషన్స్.. జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం..

Wait 5 sec.

తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో నంబర్ 9ను విడుదల చేస్తూ... బ్యాక్‌వర్డ్ క్లాస్ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించింది. ఈ నిర్ణయం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 40లో పేర్కొన్న రాష్ట్ర విధానాలకు అనుగుణంగా తీసుకోవడం విశేషం. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశాయి. జిల్లాల వారీగా జిల్లా పరిషత్‌ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులతో సమీక్షలు పూర్తిచేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా రిటర్నింగ్‌ అధికారులు, చెక్‌పోస్టులు, లాజిస్టిక్స్‌ వంటి అంశాలను ఎంపీడీవోలు ఖరారు చేశారు. గురువారం రాత్రి నుంచే పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులు ఈ సమాచారాన్ని క్షేత్రస్థాయిలోని అధికారులకు అందజేశారు. ఇక ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఎవరూ సెలవులు తీసుకోకుండా ఉండాలని ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా బీసీ వర్గాల నుంచి ఈ నిర్ణయానికి విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ రిజర్వేషన్‌ రాజకీయ భాగస్వామ్యానికి మాత్రమే కాకుండా.. గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధిలో బీసీల పాత్రను బలపరిచే దిశగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. బీసీ రిజర్వేషన్‌ పెంపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మరిన్ని అవకాశాలు అందించడంతో.. సమాజంలోని వెనుకబడిన వర్గాల సాధికారతకు ఇది పెద్ద అడుగుగా నిలవనుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాజిక న్యాయం, సమాన అవకాశాల దిశగా మరో కీలక ముందడుగుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. రాష్ట్ర పోలీసు విభాగానికి కొత్త దిశానిర్దేశం కల్పించేందుకు ‘శివధర్‌ రెడ్డి’ని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (DGP)గా నియమిస్తూ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1994 బ్యాచ్‌కి చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిగా శివధర్‌ రెడ్డి ఇప్పటికే తన అనుభవంతో ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించిన శివధర్‌ రెడ్డి, ఈ కొత్త పదవిలో రాష్ట్ర పోలీసు వ్యవస్థకు మరింత బలాన్ని చేకూర్చనున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఆయన అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అధికారికంగా డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. శివధర్‌ రెడ్డి నియామకం రాష్ట్ర పోలీసు బలగాలకు నూతన ఉత్సాహాన్ని అందించనుందని అంచనా. సుదీర్ఘ సేవా ప్రస్థానంలో ఆయన అనేక ముఖ్యమైన విభాగాల్లో పని చేసి అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. ప్రత్యేకించి ఇంటెలిజెన్స్‌ విభాగంలో ఆయన చూపిన ప్రతిభ, క్రమశిక్షణ కారణంగా ప్రభుత్వం ఈ కీలక పదవికి ఆయనను ఎంపిక చేసింది. అక్టోబర్ 1వ తేదీన శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.