ఆర్థిక ఇబ్బందులతో అనేక మంది పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. పెరుగుతున్న ఫీజులు తదితర ఖర్చలు.. తక్కువ ఆదాయ కుటుంబాలకు భారంగా మారుతున్నాయి. దీనివల్ల ముఖ్యంగా ఆడపిల్లలు మధ్యలోనే చదువు ఆపేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలా మంది విద్యార్థినులు పాఠశాల స్థాయి తర్వాత ఉన్నత విద్యను అభ్యసించేకపోతున్నారు. ఆ సమస్యను పరిష్కరించడానికి కర్ణాటక ప్రభుత్వం '' అనే కొత్త పథకం తీసుకొచ్చింది. పేద విద్యార్థినులు ఉన్నత విద్య అభ్యసించడానికి ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమైంది. 'దీపిక స్టూడెంట్ స్కాలర్‌షిప్' స్కీమ్‌కు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ శ్రీకారం చుట్టింది. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌తో భాగస్వామ్యంతో ప్రభుత్వం.. ప్రతి ఏటా విద్యార్థినులకు ఆర్థిక సాయం అందించనుంది. ఈ పథకంలో భాగంగా గ్యాడ్యుయేట్, వృత్తివిద్య, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థినులకు.. కోర్సులు పూర్తయ్యే వరకు ఏటా రూ.30,000 ఆర్థిక సాయం అందిస్తారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే ఈ పథకం ద్వారా.. రాష్ట్రంలోని 37,000లకు పైగా విద్యార్థినులు లబ్ధిపొందనున్నారు. ఒకవేళ దరఖాస్తుదారులు పెరిగితే స్కాలర్‌షిప్‌లు కూడా పెంచుతామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అర్హతలు..ఈ పథకాన్ని కేవలం ఆడపిల్లల కోసమే రూపొందించారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థినులు పదో తరగతి, PUC (ప్రీ-యూనివర్సిటీ కోర్సు) ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ, వృత్తివిద్య లేదా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొంది ఉండాలి ఆర్థికంగా వెనుకబడ్డ వర్గానికి చెందిన విద్యార్థినులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.దరఖాస్తు ప్రక్రియఈ పథకానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థినులు వ్యక్తిగత గుర్తింపు వివరాలు అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల నుంచి 10వ తరగతి, ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి PUC పూర్తి చేసినట్లు తెలిపే డాక్యుమెంట్లు అవసరం. ఉన్నత విద్యా కోర్సులలో నమోదు వివరాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాకుండా విద్యాశాఖ పోర్టల్‌లో పేర్కొన్న ఏవైనా అదనపు పత్రాలు కూడా దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. కర్ణాటకలో చదువుకు దూరమవుతున్న పిల్లల సంఖ్య ఏటా పెరుగుతోంది. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువగా చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలో సెకండరీ స్కూల్ డ్రాపౌట్ రేటు 22.2 శాతం ఉంది. జాతీయ సగటు 14.1 కంటే ఇది చాలా ఎక్కువ. దీనికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా ఆర్థిక కారణాల వల్ల పిల్లలు ఎక్కువగా చదువుకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆడపిల్లలు ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించడానికి కర్ణాటక ప్రభుత్వ దీపిక స్టూడెంట్ స్కాలర్‌షిప్ తీసుకొచ్చింది.