తెలంగాణలో 40 డిగ్రీలు దాటిన ఎండలు.. ఈసారి నిప్పులు వర్షమే, జాగ్రత్తలు తీసుకోండి

Wait 5 sec.

తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి మెుదటి వారంలోనే నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. భానుడి భగభగలు, . ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. పది తర్వాత రోడ్లపైకి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నేడు (మార్చి 8) హైదరాబాద్‌ నగరంలో పాటు చాలా జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని చెప్పారు. ముఖ్యంగా ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 40 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆకాశం పూర్తిగా నిర్మలంగా ఉండటం వల్ల సూర్యరశ్మి నేరుగా భూమిని తాకుతుందని.. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తీవ్రమైన ఉక్కపోత, వేడి ఎక్కువగా ఉంటుందన్నారు. ఆ సమయంలో బయటకు రాకుండా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఎండ ప్రభావం మరీ ఎక్కువగా ఉండనుందని చెప్పారు. నిజామాబాద్, ఆదిలాబాద్, రామగుండం ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 36 డిగ్రీల మార్కును దాటాయని చెబుతున్నారు. నేడు ఈ జిల్లాల్లో పొడి గాలులు వీచే అవకాశం ఉందని.. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని చెబుతున్నారు. ఈ మేరకు ఎండ తీవ్రత నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణిలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని తేలికపాటి త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని పండ్ల రసాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలంటున్నారు. దాహం వేయకపోయినా తరుచూ నీళ్లు తాగాలని తద్వారా శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాదని అంటున్నారు. మసాలా ఫుడ్స్, మద్యం, సిగరెట్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.