తెలంగాణ ప్రభుత్వం పేదలకు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటికే కొందరు లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయగా.. మరికొన్ని ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ నెలాఖరులోగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు చేస్తామని తాజాగా.. రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో గృహ ప్రవేశాలకు అనుకూలమైన తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3.60 లక్షల ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. ఈ ఇళ్లన్నింటికీ గ్రౌండింగ్‌ కూడా పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. శనివారం సెక్రటేరియట్‌లో 'ప్రజా పాలన-ప్రగతి నివేదిక'లో భాగంగా 99 రోజుల్లో చేపట్టాల్సిన కార్యచరణపై జిల్లా హౌసింగ్‌ పీడీలతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యంతో చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మంజూరు చేసిన ఇళ్లలో ఇప్పటి వరకు 20 శాతం కూడా గ్రౌండింగ్‌ పనులు పూర్తికాలేదని అన్నారు. ఇలాంటి ఇళ్లకు లబ్ధిదారుల సమ్మతి తీసుకుని స్థానిక ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీల సహకారంతో మార్చి 31లోపు యుద్ధ ప్రాతిపాదికన గ్రౌండింగ్‌ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణానికి దగ్గరగా ఉన్న ఇళ్లను జూన్‌ చివరి నాటికి పూర్తి చేయాలన్నారు. ఏప్రిల్‌లో రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అప్పటిలోగా మొదటి దశ ఇందిరమ్మ ఇళ్లు కొలిక్కి రావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇళ్ల నిర్మాణంలో పెరిగిన సామగ్రి ధరల ప్రభావం పడకుండా ధరల నియంత్రణ కమిటీలు చురుగ్గా పని చేయాలన్నారు. అవసరమైతే జిల్లా కలెక్టర్లతో కలిసి సమీక్షించి ధరల పెరుగుదలలో సమస్య ఉంటే పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఒకటి లేదా రెండు సార్లు చెల్లింపులు చేసిన తర్వాత వివిధ కారణాలతో మిగతా చెల్లింపులు ఆపివేయడం సరికాదని అన్నారు. అలాంటి వారికి కూడా పూర్తిగా బిల్లులు చెల్లించాలన్నారు. ప్రస్తుతం నిర్మాణ స్థాయిలో ఉన్న రెండు పడకల గదుల ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను సైతం మార్చి 31లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థలం లేని పేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక హౌసింగ్‌ బోర్డు పరిధిలో పెండింగ్‌లో ఉన్న 5 వేల రిజిస్ట్రేషన్లను పూర్తిచేస్తామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హౌసింగ్‌ బోర్డు రూపొందించిన హౌసింగ్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి.. 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక పోస్టర్‌ను ఆవిష్కరించారు.