విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. పూర్తి చేసి మనదేశానికి తిరిగి వచ్చిన విద్యార్థులు.. రిజిస్ట్రేషన్ పత్రాలకు సంబంధించి సమస్య ఎదుర్కొంటున్నారు. శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాలు జారీ చేయకపోవటంతో ఇబ్బందులు పడుతూ వచ్చారు. అయితే వారి సమస్యను ఏపీ ప్రభుత్వం తాజాగా పరిష్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ కారణంగా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులకు శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాలు జారీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 మంది విద్యార్థులకు శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాలు అందించనున్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సిద్ధమైంది. ఇప్పటికే నలుగురు విద్యార్థులకు శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాలు అందించారు.ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా ఇప్పటికే నలుగురికి శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాలు అందించారు. మిగిలిన 66 మంది విద్యార్థులకు సోమవారం ( మార్చి 9 ) నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాలు అందించనున్నారు. ఈ విషయాన్ని ఛైర్మన్ శ్రీహరిరావు వెల్లడించారు. మరోవైపు శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాల జారీ విషయంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ ఓ నిబంధన విధించింది. ఉక్రెయిన్, చైనా, ఫిలిప్పీన్స్, కజకిస్తాన్ వంటి ఏడు దేశాల్లో ఎంబీబీఎస్‌ చదివి.. ఏపీలో ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన వారికి మాత్రమే శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాలు జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీ మెడికల్ కౌన్సిల్ స్పష్టం చేసింది. మరోవైపు విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ కీలక సూచన చేసింది. కరోనా, ఇతర కారణాలతో ఆన్‌లైన్ క్లాసులకు హాజరైన వారు.. ఆన్‌లైన్ తరగతులకు బదులుగా కాంపెన్సేషన్ తరగతులు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మెడికల్ కౌన్సిళ్లకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు మనదేశంలో పనిచేయాలంటే.. తప్పనిసరిగా ఈ నిబంధన అనుసరించాలని స్పష్టం చేసింది. ఎంబీబీఎస్ వంటి వైద్యవిద్యలో ప్రాక్టికల్ పరిజ్ఞానం చాలా అవసరమని.. ఆన్‌లైన్ క్లాసుల మూలంగా ఈ లోటు ఏర్పడిందని జాతీయ వైద్య కమిషన్ అభిప్రాయపడింది. ఈ లోటును భర్తీ చేసేందుకు ఫిజికల్ క్లినికల్ ట్రైనింగ్ అవసరమంటూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.