మూసీ నదికి రెండు వైపులా ఆరు లైన్ల రోడ్డు నిర్మించనున్నట్లు మూసీ నదీతీర అభివృద్ధి సంస్థ(ఎంఆర్‌డీసీఎల్‌) ) ఎండీ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. ఈ 6 లైన్ రోడ్డుతో విజయవాడ, ముంబయి, బీజాపుర్‌ హైవేలకు అనుసంధానం జరుగుతుందని చెప్పారు. బుద్వేల్‌ వద్ద ఓ జంక్షన్‌ వస్తుందని వెల్లడించారు. ఓఆర్‌ఆర్‌ తరహాలో టీవోటీ పద్ధతిలో అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉందని అన్నారు. అత్తాపూర్‌ నుంచి ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రారంభమవుతుందని.. పురానాపూల్, నయాపూల్, చాదర్‌ఘాట్, మూసారంబాగ్, గౌరెల్లి వద్ద ఎగ్జిట్‌లు ఉంటాయని వెల్లడించారు. మెట్రోకారిడార్‌ వస్తుందని.. మూసీ అభివృద్ధి ద్వారా హైదరాబాద్‌కు లభించిన సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోనున్నామని చెప్పారు. నదీతీరం వెంట దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా అభివృద్ధి చేయనున్నామన్నారు. వచ్చేవారం డీపీఆర్‌ను ఆన్‌లైన్లో పెట్టనున్నామని.. ప్రజలు సూచనలు, సలహాలు ఇవ్వవచ్చునని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూసీ ఇన్వెట్స్ సదస్సులో ఆయన మాట్లాడి మూసీ నదీతీర ప్రాజెక్టుపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టు ప్రభుత్వానికి ఆప్షన్ కాదని.. అది తప్పనిసరి చేయాల్సిన ప్రాజెక్టు అని తేల్చి చెప్పారు. మూసీ పునరుజ్జీవమంటే కేవలం పరిశుభ్రం చేయటం మాత్రమే కాదని.. నగర సుస్థిర సమగ్ర ఆర్థికాభివృద్ధి వ్యూహంతో ముందుకు వెళ్తామని తెలిపారు. ప్రకృతి చూపిన సహజసిద్ధ మార్గంలో మూసీ నిరంతరం ప్రవహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్‌లో వెయ్యి చెరువులను అభివృద్ధి చేసి ఒకదానితో మరొకటి లింకు చేసేలా పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. మూసీ నదికి రెండువైపులా 50 మీటర్ల బఫర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. భారీ క్లౌడ్‌బరస్ట్‌తో వర్షాలు పడినా 60వేల క్యూసెక్కుల నీరు ప్రవహించినా ఇబ్బంది లేకుండా అభివృద్ధి మూసీని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. వందేళ్లలో ఒకసారి భారీవరదలు వస్తాయని చెప్పారు. నదికి రెండువైపులా 30 మీటర్ల ఆరు లేన్ల రోడ్లు, 9 మీటర్ల సర్వీసు రోడ్లు వస్తాయన్నారు. నదులకు ఇరువైపులా 50 మీటర్లను బఫర్‌జోన్‌గా గుర్తిస్తూ ప్రభుత్వం 2012, 2016లో జీవోలు జారీచేసిందని గుర్తు చేశారు. ఈ బఫర్‌లో నిర్మాణాలకు, నివాస ప్రాంతాలకు అనుమతి లేదని అన్నారు. మురుగును మూడుసార్లు శుద్ధిచేసి ఆ నీటిని పరిశ్రమలు, డేటా సెంటర్లకు ఇస్తామన్నారు. గాంధీ సరోవర్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. దాదాపు 200 ఎకరాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. గాంధీ చరఖా మాదిరి అక్కడి ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని.. ఆ విగ్రహం నుంచి నగరాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.