హైదరాబాద్ నగరం విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మౌళిక సదుపాయాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందుబాలో భాగంగా.. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లకు తోడుగా అత్యాధునిక హంగులతో కూడిన ఫోర్త్ సిటీ ( ఫ్యూచర్ సిటీ)ని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఈ కొత్త అథారిటీ సేవలు మరో వారంలో అందుబాటులోకి రానున్నాయి.765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కొత్త అథారిటీ పనిచేయనుంది. రంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాల్లోని 56 గ్రామాలు దీని పరిధిలోకి వస్తాయి. ఆమన్‌గల్‌, ఇబ్రహీంపట్నం, కడ్తాల్‌, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాల్లోని గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికే 36 హెచ్ఎండీఏ గ్రామాలు, 20 టీడీసీపీ గ్రామాలు ఉన్నాయి. FCDAకి ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, మున్సిపల్ శాఖ మంత్రి వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. పలు ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యదర్శులను సభ్యులుగా నియమించారు. ఈ అథారిటీ కోసం మొత్తం 36 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.ఇప్పటికే ఐఏఎస్ అధికారి శశాంక్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ప్లానింగ్‌ అదనపు డైరెక్టర్‌గా టీడీసీపీ డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. చీఫ్ ఇంజినీర్, సూపరింటెండెంట్ ఇంజినీర్ వంటి ఇతర కీలక పోస్టులకు నియామకాలు జరుగుతున్నాయి. ఎఫ్‌సీడీఏ సేవలు అందుబాటులోకి వచ్చాక, దాని పరిధిలోని భవన నిర్మాణాలు, లేఅవుట్‌లకు సంబంధించిన అనుమతులను ఎఫ్‌సీడీఏ నేరుగా జారీ చేస్తుంది. ప్రస్తుతం ఈ బాధ్యతలను హెచ్ఎండీ, టీడీసీపీ నిర్వహిస్తున్నాయి.ఎఫ్‌సీడీఏ కోసం ప్రత్యేకంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. దీని ద్వారా దరఖాస్తులు నేరుగా ఎఫ్‌సీడీఏ కార్యాలయానికి చేరుకుంటాయి. హెచ్ఎండీఏ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు అవతలి ప్రాంతాలకు వర్తించే నిబంధనలే ఎఫ్‌సీడీఏ ప్రాంతానికి కూడా వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో హైదరాబాద్‌ మహానగరం మరింత విస్తరించడం, అభివృద్ధి చెందడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు.