HYD వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతంలో కొత్త ఫ్లైఓవర్, ఇక సిగ్నల్ ఫ్రీ జర్నీ

Wait 5 sec.

హైదరాబాద్ నగర వాహనదారులకు గుడ్‌న్యూస్. నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు, ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కీలక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా . నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్కు నుంచి రసూల్‌పుర చౌరస్తా వరకు నేరుగా వెళ్లేందుకు రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ROB)ని నిర్మించనుంది. వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా సిగ్నల్ ఫ్రీ జర్నే చేసే వీలు కలగనుంది. ఆర్వోబీ నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ సుమారు రూ80 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ వంతెన మెుత్తం పొడవు 600 మీటర్లు. ఇది నెక్లెస్ రోడ్డులోని పాటిగడ్డ ప్రాంతాన్ని కలుపుతుంది. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రూ.11.15 కోట్ల వ్యయంతో 15 ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే శాఖతో ఉన్న సమస్యలు పరిష్కారం కావడంతో త్వరలో టెండర్లు పిలిచేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రయాణికులు నెక్లెస్ రోడ్డు, సంజీవయ్య పార్కు నుంచి రసూల్‌పుర చౌరస్తాకు చేరుకోవడానికి రైల్వే స్టేషన్, మినిస్టర్ రోడ్డు మీదుగా 4 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ కొత్త వంతెన అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం సుమారు 20 నిమిషాలు ఆదా అవుతుంది. అంతేకాకుండా, బేగంపేట ప్రధాన రహదారిపై ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. బేగంపేట, సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రాంతాల నుంచి ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి వైపు వెళ్లే వాహనదారులకు ఇది ప్రత్యామ్నాయ, వేగవంతమైన మార్గంగా ఉపయోగపడుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR)పై పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని, ఇతర ప్రధాన రహదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ ప్రణాళికలో భాగంగా.. బేగంపేట నుంచి మినిస్టర్ రోడ్డు, పాటిగడ్డ రోడ్డుకు వెళ్లే మార్గంలో రసూల్‌పుర చౌరస్తాలో రూ.150 కోట్లతో 'వై' ఆకారంలో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఈ వై-ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ కూడా తుది దశలో ఉంది. ఇది పూర్తయితే నల్గొండ ఎక్స్ రోడ్డులోని ఫ్లైఓవర్ మాదిరిగా రసూల్‌పుర వద్ద ట్రాఫిక్ సమస్య మరింత తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే నగరంలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రయాణం మరింత సులభతరం అవుతుందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.