ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు పథకం.. ఈ ఐదు బస్సుల్లో ఫ్రీ.. పూర్తి వివరాలివే

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పలు సంస్థలకు భూకేటాయింపులు, రాయితీలకు ఆమోదం లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో 40శాతం, అంతకంటే ఎక్కు వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ పథకం వర్తిస్తుంది.దివ్యాంగులకు కూడా ప్రస్తుతం స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్న ఐదు రకాల బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. దివ్యాంగులకు పల్లెవెలుగు, అల్ట్రాపల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్‌ ఐదు రకాల బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం ఉంటుంది. ప్రస్తుతం 50 శాతం రాయితీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. ఇకపై దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది ప్రభుత్వం. అయితే ఇప్పటికే సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నారు. అయితే దివ్యాంగులకు స్త్రీశక్తి పథకం వర్తించని నాన్‌స్టాప్, అంతర్రాష్ట్ర, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్‌ బస్సుల్లో ఇస్తున్న 50 శాతం రాయితీ అలాగే కొనసాగుతుందని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో పథకానికి ఇంధ్రధనస్సు పేరును ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే.ఏపీ కేబినెట్‌లో పలు సంస్థలకు స్థలాలను కేటాయించారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో నమోదు చేసిన కొన్ని కేసుల్ని ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణం, అటవీ, శాస్త్ర, సాంకేతికశాఖ పేరు ‘పర్యావరణం అటవీశాఖ’గా మార్చారు. అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్‌ మోటారు వాహనాల పన్నుల (సవరణ) బిల్లు-2026ను ప్రవేశపెట్టడానికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కొల్లేరు వన్యప్రాణి అభయారణ్య సరిహద్దుల్ని క్రమబద్ధీకరణకు సంబంధించి ఆమోదం తెలిపారు. వీటితో పాటుగా మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ కేబినెట్.మరోవైపు 'శ్రీకాకుళంలో డయేరియా అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. జిల్లా అధికారులతో కూడా మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. శ్రీకాకుళం నగరంలో రోడ్ రిపేర్ పనుల కారణంగా మంచినీటి పైపు లైన్లు దెబ్బతిని డయేరియా వ్యాపించిందని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 65 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎనిమిది మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం వారికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. తాగునీటి కాలుష్యం జరగకుండా క్లోరినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, మురుగునీటి కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం సూచించారు. ప్రజలు భయాందోళనకు గురికాకుండా అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి బాధితులకు ధైర్యం చెప్పాలని ఆదేశించారు' అని సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.