: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో దౌత్యపరమైన అంశాల కంటే ఎక్కువగా ఇద్దరు ప్రపంచ నేతల మధ్య ఉన్న ఆత్మీయత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం రోజు టెల్ అవీవ్ విమానాశ్రయంలో మోదీకి లభించిన ఘనస్వాగతం, ఆపై చోటుచేసుకున్న ఆసక్తికర పరిణామాలు భారత్-ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్న దృఢమైన బంధానికి అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా నెతన్యాహు.. ప్రధాని మోదీతో మాట్లాడుతూ నా భార్య ఏ డ్రెస్ వేసుకుందో చూశారా అంటూ చెబుతున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆయన అలా ఎందుకు అన్నారు, ప్రధాని మోదీ అప్పుడెలా స్పందించారో మనం ఇప్పుడు చూద్దాం పదండి. కాషాయ రంగు దుస్తుల్లో.. మోదీకి మ్యాచింగ్..ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన భార్య సారా నెతన్యాహులే స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మరీ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ తెల్లటి కుర్తా-పైజామా, స్లీవ్‌లెస్ జాకెట్ ధరించగా.. దానికి అదనంగా కాషాయ రంగు పాకెట్ స్క్వేర్‌ను అలంకరించుకున్నారు. యాదృచ్ఛికంగా సారా నెతన్యాహు కూడా అదే రంగు దుస్తులను ధరించడంతో.. ఇజ్రాయెల్ ప్రధాని సరదాగా చమత్కరించారు."చూశారా.. ఆమె ఏ రంగు డ్రెస్ వేసుకుందో?" అంటూ నెతన్యాహు తన భార్య డ్రెస్ వైపు, మోదీ పాకెట్ స్క్వేర్ వైపు చూపిస్తూ అడిగారు. దీనికి మోదీ నవ్వుతూ "అవును కాషాయ రంగు" అంటూ సమాధానం ఇచ్చారు. ఈ చిన్న సన్నివేశం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. సారా నెతన్యాహు భారత్‌ను "అద్భుతమైన దేశం" అని కొనియాడగా.. నెతన్యాహు వెంటనే స్పందిస్తూ మోదీని.. "అద్భుతమైన నాయకుడు" అని ప్రశంసించారు.భారతీయ దుస్తుల్లో నెతన్యాహు సర్‌ప్రైజ్..!నేతల మధ్య స్నేహం కేవలం మాటలకే పరిమితం కాలేదు. రాత్రి సంయుక్త విందు సమయంలో నెతన్యాహు తన స్నేహితుడిని ఆశ్చర్య పరచడానికి భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించారు. "నా స్నేహితుడు ప్రధాని మోదీని ఆశ్చర్య పరచడానికి నేను భారతీయ దుస్తులు ధరించాను" అంటూ నెతన్యాహు చెప్పారు. అలాగే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "సందేశం స్పష్టం.. భారత్-ఇజ్రాయెల్ బంధం విడదీయలేనిది" అంటూ కామెంట్లు చేస్తున్నారు.క్నెసెట్‌లో చారిత్రాత్మక ప్రసంగం..మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో మరో ప్రధాన ఘట్టం ఏమిటంటే.. ఇజ్రాయెల్ పార్లమెంట్ 'క్నెసెట్'ను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధాన మంత్రిగా మోదీ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ జరుపుతున్న పోరాటంలో భారత్ ఎప్పుడూ వెన్నంటే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పర్యటన కేవలం రక్షణ, సాంకేతిక రంగాల్లోనే కాకుండా ఇరు దేశాల ప్రజల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.