కొత్తగా వాహనాలు కొంటున్నారా..? అయితే మీ జేబుకు చిల్లు పడినట్లే. ఎందుకంటే రిజిస్ట్రేషన్ సమయంలోనే కొత్త అదనపు బాదుడుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. కొత్త వాహనాల కొనుగోలుపై చేయనున్నారు. ఈ మేరకు సెస్ చెల్లించే నిబంధన మార్చి 1 నుంచి అమల్లోకి రానుంది. మోటారు వెహికల్ యాక్ట్ చట్టంలో పన్నుల విధింపుపై రాష్ట్రానికి ఉన్న అధికారాల్ని వినియోగిస్తూ తెలంగాణ రవాణాశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం.. నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలపై రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు అదనంగా రోడ్డు భద్రత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాలు, కార్లతోపాటుగా ఇతర వ్యక్తిగత వాహనాలు, గూడ్స్ వెహికల్స్, ప్రయాణికుల్ని తీసుకెళ్లే ఆటోలు ఈ విభాగం పరిధిలోకి వస్తాయి. కొత్త వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించే సమయంలో ఈ అదనపు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మూడు చక్రాల గూడ్స్ వాహనాలపై గతంలో క్వార్టర్లీ ట్యాక్స్‌ ఉండేది. రవాణాశాఖ తాజాగా దాన్ని లైఫ్‌ట్యాక్స్‌ పరిధిలోకి తీసుకు వచ్చింది. రోడ్డు భద్రత చర్యలకు అవసరమయ్యే నిధుల సమీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ అదనపు ట్యాక్స్ ద్వారా ప్రతి ఏడాది సుమారు రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. వ్యవసాయ ప్రయోజనాలకు ఉపయోగించే ట్రాక్టర్లు, ట్రైలర్లకు మాత్రం పన్ను మినహాయింపు ఉంటుంది.ఈ ట్యాక్స్ పరిధిలోకి బైకులు, కార్లు, తేలికపాటి వాహనాలు వస్తాయి. ఇతర వాహనాల పరిధిలోకి 4 నుంచి 7 సీట్ల సామర్థ్యం ఉన్న ప్రయాణికుల ఆటోలు వస్తాయి. రోడ్డు భద్రత పన్ను బైకులు, స్కూటీలు వంటి ద్విచక్రవాహనాలకు రూ. 2 వేలు ఉంటుంది. కార్లు వంటి వాటికి రూ.5 వేలు వసూలు చేయనున్నారు. ఇతర వాహనాలు అంటే గూడ్స్ వెహికల్స్, ఆటోల్లో రూ.10 వరకు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడికి.. కొత్త వాహనం కొనేటప్పుడు ఈ అదనపు పన్ను ఖచ్చితంగా భారమే అవుతుంది. ఈ నిర్ణయంపై పునరాలోచించాలని వాహనదారులు కోరుతున్నారు. అయితే సర్కార్ మాత్రం పన్ను విధింపుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అంటోంది.