తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌ కలిశారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్న (ఏఐ) టెక్నాలజీ గురించి.. రేవంత్ రెడ్డి, శంతను నారాయణ్ చర్చించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్‌ బోర్డు సభ్యుడిగా కూడా శంతను నారాయణ్ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కొత్త అవకాశాలు, గ్లోబల్‌ ట్రెండ్స్‌పై వారిద్దరూ చర్చించారు. వివిధ రంగాల్లో ఏఐతో ఉద్యోగాలపై పడే ప్రభావం, గ్రీన్‌ ఎనర్జీ, రాష్ట్ర ప్రభుత్వం పరంగా చేపట్టాల్సిన పలు చర్యలు సహా పలు అంశాలపై వారిద్దరి మధ్య లోతైన చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవడంపై శంతను నారాయణ్‌తో సీఎం రేవంత్‌ చర్చలు జరిపారు.ఈ సందర్భంగా తెలంగాణను ఏఐ మాన్యుఫ్యాక్చరింగ్ పవర్‍గా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అందుకోసం కొన్ని కీలక సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు తయారు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలను రేవంత్ రెడ్డికి శంతను నారాయణ్ వివరించారు. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్, రీస్కిల్లింగ్‍ వంటి అంశాలపై రేవంత్ రెడ్డికి, శంతను నారాయణ్ చర్చించారు. ఆర్థిక వ్యవస్థపై ఏఐ రెవల్యూషన్ ప్రభావం.. రానున్న రోజుల్లో ఏఐని మరింత సమర్ధంగా ఉపయోగించుకునే అంశాలపై శంతను నారాయణ్‍తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. తెలంగాణను అభివృద్ధిలో మరింత ముందుకు నడిపించేందుకు సహకరించాలని ఈ సందర్భంగా శంతను నారాయణ్‌ను సీఎం కోరారు.ఇక ఇటీవలె ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులో హాజరై ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. కేంద్ర, రాష్ట్రాల్లో ఏఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచ టెక్నాలజీలో ఏఐ రాకతో సమూల మార్పులు వచ్చాయని తెలిపారు. ఏఐని ఉపయోగించడం, దాన్ని నియంత్రించడం, ఏఐకి సంబంధించిన మార్గదర్శకాలు, ఏఐతో జాతీయ భద్రత వంటి అంశాల కోసం ఈ ఏఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం అత్యవసరమని పేర్కొన్నారు.