దుబాయ్ ఎయిర్‌పోర్ట్ దగ్గర పేలుడు… ప్రాణభయంతో పీవీ సింధు!

Wait 5 sec.

భారత ఒలింపిక్ పతక విజేత, స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి దుబాయ్ విమానాశ్రయంలో ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇరాన్‌కు సంబంధించిన దాడుల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో, ఆమె ప్రయాణిస్తున్న విమానం రద్దయి దుబాయ్‌లో చిక్కుకుపోయింది.ఈ సమయంలో, వారు తలదాచుకున్న ప్రాంతానికి సమీపంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించిందని సింధు వెల్లడించారు. పొగ, ధూళి, శబ్దాలతో పరిస్థితి ఒక్కసారిగా భయంకరంగా మారిందని చెప్పారు. ముఖ్యంగా ఆమె కోచ్ ఆ ప్రాంతానికి అత్యంత దగ్గరగా ఉండడంతో, వెంటనే అక్కడి నుంచి బయటకు పరుగెత్తాల్సి వచ్చిందని వివరించారు.“ప్రతి గంటకూ పరిస్థితి మరింత భయానకంగా మారుతోంది. కొద్ది గంటల కిందట మా దగ్గరే పేలుడు జరిగింది. అది చాలా టెన్షన్ కలిగించిన క్షణం” అంటూ సింధు తన ‘ఎక్స్’ ఖాతాలో రాసుకొచ్చారు. ఈ సంఘటన తర్వాత, వారిని మరింత సురక్షితమైన ప్రదేశానికి తరలించారని సింధు తెలిపారు. ఇందుకు గాను ఎయిర్‌పోర్ట్ అధికారులు, అలాగే దుబాయ్‌లోని ఇండియన్ హై కమిషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ భద్రత కోసం వారు నిరంతరం సహకరిస్తున్నారని పేర్కొన్నారు.సింధు బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరగనున్న ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు బయలుదేరారు. ట్రాన్సిట్‌గా ఆమె దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఆగాల్సి వచ్చింది. కానీ, ఒక్కసారిగా ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరగడంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.ఇదే సమయంలో, ఎయిర్‌పోర్ట్‌లో కూడా కార్యకలాపాలు నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు విమానాశ్రయాలకు రావద్దని సూచించారు. దీంతో వేలాది మంది ప్రయాణికులతో పాటు సింధు కూడా అక్కడే చిక్కుకుపోయారు.ఇంతకుముందు, విమానాశ్రయం లోపలి విజువల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సింధు, అన్ని విమానాలు నిలిపివేశారని తెలిపారు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యుద్ధ పరిస్థితుల ప్రభావం కేవలం యుద్ధ ప్రాంతాలకే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికులపై ఎలా పడుతుందో దీనివల్ల స్పష్టమైంది. ప్రస్తుతం తాము సురక్షితంగా ఉన్నామని, కొంత విశ్రాంతి తీసుకుంటూ పరిస్థితి సాధారణ స్థితికి రావాలని ఆశిస్తున్నామని సింధు తెలిపారు.