కేరళకు చెందిన శ్రీవారి భక్తుడి ఫిర్యాదు.. తీగలాగితే కదిలిన డొంక.. భక్తులను అప్రమత్తం చేసిన టీటీడీ

Wait 5 sec.

తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులను అప్రమత్తం చేసింది. తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తామని శ్రీవారి భక్తులను కొంతమంది మోసం చేస్తున్నట్లు గుర్తించింది. ఇలాంటి దళారులు, నకిలీ వెబ్‌సైట్లపై అప్రమత్తమైన టీటీడీ .. భక్తులకు పలు కీలక సూచనలు చేసింది. కేరళకు చెందిన సురేష్ బాబు అనే భక్తుడిని ఓ వ్యక్తి మోసం చేశారు. తిరుమలలో కర్ణాటక ప్రవాసి సౌధ పేరుతో గదులు ఏర్పాటు చేస్తామని చెప్పి ఓ వ్యక్తి సురేష్ బాబును మోసగించారు. ఈ నేపథ్యంలో సురేష్ బాబు దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో టీటీడీ విజిలెన్స్ విభాగం స్పందించి సమగ్ర విచారణ చేపట్టింది. ఈ విచారణలో తిరుమల శ్రీవారి ఆలయం ఫోటోలు, టీటీడీ పేరును అనధికారికంగా వాడుకుంటూ కొంతమంది నకిలీ వెబ్‌సైట్లు రూపొందించినట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈ నకిలీ వెబ్ సైట్ల సాయంతో భక్తులను తప్పుదారి పట్టిస్తున్నట్టు గుర్తించింది. గూగుల్‌లో వెతికినప్పుడు కూడా ఈ ఫేక్ వెబ్‌సైట్లు కనిపిస్తున్నట్లు టీటీడీ గుర్తించింది, ఈ నకిలీ వెబ్ సైట్ల ద్వారా భక్తుల నుంచి ఆన్‌లైన్ విధానంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి నకిలీ వెబ్‌సైట్లపై టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు టీటీడీ చిహ్నాలు, ఆలయం ఫోటోలను అనధికారికంగా ఉపయోగించే వెబ్‌సైట్లపై కాపీరైట్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు ఇలాంటి నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని.. తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, సేవా టికెట్ల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.inను సంప్రదించాలని సూచించింది. దళారులు, నకిలీ వెబ్ సైట్లను నమ్మి మోసానికి గురికావొద్దని విజ్ఞప్తి చేసింది. అనుమానాస్పద వెబ్‌సైట్లు, ఫోన్ కాల్స్‌ గురించి సమాచారం ఉంటే వెంటనే టీటీడీ దృష్టికి తీసుకురావాలని టీటీడీ కోరింది. అన్నప్రసాద వితరణ కేంద్రాల మూసివేతమరోవైపు మార్చి మూడో తేదీ చంద్రగ్రహణం కావటంతో తిరుపతి, తిరుచానూరులోని టీటీడీ అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుచానూరులోని ఎస్వీ నిత్య అన్నప్రసాద భవనం, తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్‌, పద్మావతి విశ్రాంతి భవనంలోని క్యాంటీన్‌, శ్రీనివాసం, విష్ణునివాసం వసతి సముదాయాల్లో ఉచిత అన్నప్రసాద వితరణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుపతిలోని ప్రభుత్వ వైద్యశాలలు, వివిధ ప్రథమ చికిత్స కేంద్రాల్లో రోగులు, వారి సంరక్షకులకు అందించే అన్నప్రసాదాలను ముందస్తుగా పంపిణీ చేయనున్నారు.