దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో.. ఒకవైపు అడవుల్లో ఏరివేత ఆపరేషన్లు కొనసాగుతుండగా.. మరోవైపు.. మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయే కార్యక్రమాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది నక్సల్స్ నేలకొరిగారు. చాలా మంది పోలీసుల ముందు లొంగిపోయి.. జన జీవన స్రవంతిలో కలిసిపోయారు. మంగళవారం రోజున కీలక నేతలైన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, నర్సింహా రెడ్డి అలియాస్ గంగన్న, బడే చొక్కారావు అలియాస్ సాగర్‌లతోపాటు దాదుపు 20 మంది మావోయిస్ట్‌లు ఒకేసారి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్ట్ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతిపై అందరి దృష్టి పడింది. మార్చి 31వ తేదీ నాటికి మావోయిస్ట్ రహిత దేశంగా భారత్‌ను మార్చాలన్న ఆకాంక్షతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ కగార్ తుది దశకు చేరిన వేళ.. మావోయిస్టు పార్టీ టాప్ నేతలు అంతా ఒక్కొక్కరు వరుసగా పోలీసుల ముందు లొంగిపోతున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్ట్ పార్టీ టాప్ లీడర్ ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి ఆచూకీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే గణపతి సోదరుడు రామచంద్ర రావు మీడియా ద్వారా తన అన్న గణపతికి కీలక వినతి చేసుకున్నారు. తక్షణమే పోలీసుల ఎదుట లొంగిపోవాలని గణపతికి సూచించారు. గణపతి జనంలోకి రావడం కోసం తమ కుటుంబ సభ్యులతో పాటు తమ గ్రామం మొత్తం ఎదురుచూస్తోందని రామచంద్ర రావు పేర్కొన్నారు. గణపతితో కలిసి మావోయిస్ట్ పార్టీ ఉద్యమం కోసం పనిచేసిన చాలా మంది నేతలు ఇప్పటికే పోలీసుల ముందు లొంగిపోయారని గుర్తు చేశారు. గణపతిపై దేశంలోని 12 రాష్ట్రాల్లో చాలా కేసులు ఉన్నాయని వెల్లడించారు. స్వయంగా గణపతి వచ్చి పోలీసుల ముందు లొంగిపోతే.. ఆయనపై ఉన్న కేసులు మొత్తాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తివేయాలని ఈ సందర్భంగా రామచంద్ర రావు వేడుకున్నారు.2018లో వయసు మీద పడటం, అనారోగ్యం కారణంగా మావోయిస్ట్ పార్టీ సారథ్యాన్ని గణపతి.. నంబాల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌కు అప్పగించారు. ఆ తర్వాత దండకారణ్యానికే పరిమితమైన ఆయన.. ఛత్తీస్‌గఢ్‌ అబూజ్‌మడ్‌ అడవుల్లోనే ఉంటూ పార్టీ కార్యకలాపాలు చూసుకునేవారు. 2024 జులై 13వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు అబూజ్‌మడ్‌ అడవుల్లో నిర్వహించిన సమావేశంలో గణపతి పాల్గొన్నట్లు ఎస్‌ఐబీకి కచ్చితమైన సమాచారం వచ్చింది. కానీ ఆ తర్వాత నుంచి ఆయన జాడ కనిపించలేదు. అయితే జార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌ మీదుగా గణపతి నేపాల్‌కు వెళ్లారని.. అక్కడి నుంచి ఫిలిప్పీన్స్‌కు వెళ్లి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ భారత్‌లోనే ఎక్కడో ఓ చోట దాక్కోవచ్చనే ప్రచారం జరుగుతోంది.