IPL ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఆలస్యంగా ఐపీఎల్ 2026, బీసీసీఐ కీలక నిర్ణయం!

Wait 5 sec.

సీజన్ ప్రారంభం అనుకున్న దాని కంటే మరో రెండు రోజులు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మార్చి 26 నుంచి టోర్నీ మొదలవుతుందని ప్రకటించిన ఐపీఎల్ నిర్వాహకులు, ఇప్పుడు మార్చి 28 లేదా మార్చి 29 తేదీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదని, వచ్చే వారం తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.అబుదాబీలో జరిగిన మినీ వేలంలో మార్చి 26 నుంచి మే 31 వరకు సీజన్ విండోగా జట్లకు తెలియజేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారడంతో, ఫైనల్ తేదీ కూడా ఒకటి రెండు రోజులు వాయిదా పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఈ ఆలస్యానికి ప్రధాన కారణం తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే. ఈ ఎన్నికల షెడ్యూల్ కొన్ని నగరాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లతో కలిసే అవకాశముండటంతో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తేదీలు ప్రకటించే వరకు పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయకుండా బీసీసీఐ వేచి చూస్తోంది.ఇప్పటికే ఫ్రాంచైజీల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, తొలుత పాక్షిక షెడ్యూల్ విడుదల చేసి, తర్వాత పూర్తి ఫిక్చర్స్ ప్రకటించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. ఇలాంటి విధానాన్ని 2019లో కూడా అమలు చేశారు.ఇదిలా ఉండగా, బీసీసీఐ ఇటీవల బ్రాడ్‌కాస్టర్ జియో హాట్‌స్టార్‌తో పాటు 10 ఫ్రాంచైజీలతో సమావేశమైంది. ప్రీ-సీజన్ హైప్ ఎలా పెంచాలి, ప్రచారాన్ని ఎలా విస్తృతంగా నిర్వహించాలి అనే అంశాలపై చర్చించారు. అమెరికాలోని ఎన్ఎఫ్ఎల్, ఎన్‌బీఏ లాంటి లీగ్‌ల తరహాలో ఐపీఎల్ బ్రాండింగ్‌ను మరింత బలంగా తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఆటగాళ్ల భాగస్వామ్యంతో సోషల్ మీడియా, ప్రచార కార్యక్రమాలను పెంచాలని నిర్ణయించారు. మొత్తంగా చూస్తే, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఐపీఎల్ 2026 ప్రారంభ తేదీపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. అభిమానులు మాత్రం అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.