Lease Agreement: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. నవీ ముంబైలోని ఏరోలిలో నెవా భక్తి నాలెడ్జ్ సిటీలో తన కొత్త గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్ () ఏర్పాటు కోసం 1,34,000 చదరపు అడుగుల మేర కార్యాలయ స్థలం అద్దెకు తీసుకుంది. ఐదేళ్లకు గానూ చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇక్కడ నెలకు ఎస్బీఐ రూ. 1.68 కోట్ల చొప్పున అద్దె చెల్లించనుంది. ఈ మేరకు లీజ్ డాక్యుమెంట్స్‌ను పరిశీలించిన రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ ప్రాప్‌స్టాక్ వెల్లడించింది. స్టేట్ బ్యాంక్ గ్లోబల్ ఐటీ సెంటర్ 6 ఫ్లోర్ల మేర విస్తరించి ఉండగా.. దీనిని నెవా టెక్నాలజీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లీజుకు తీసుకుంది. ఈ లీజ్ ట్రాన్సాక్షన్ ఫిబ్రవరిలోనే జరిగినట్లు ప్రాప్‌స్టాక్ తెలిపింది. ఒకవేళ ఐదేళ్ల తర్వాత లీజింగ్ రెనివల్ చేసుకోవాలంటే అప్పుడు అద్దె 15 శాతం చొప్పున పెరగనుంది. ఇక్కడ ప్రస్తుతం ఒక నెలకు చూస్తే చదరపు అడుగుకు అద్దె రూ. 125.05 చొప్పున చెల్లించాల్సి వస్తుంది. బ్యాంక్ ఇప్పటికే సెక్యూరిటీ డిపాజిట్ (అడ్వాన్స్) కింద రూ. 10.11 కోట్లు చెల్లించినట్లు డాక్యుమెంట్లను బట్టి తెలుస్తోంది. అంతకుముందు 2024లో ఎస్బీఐకి చెందిన.. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో రెండు కమర్షియల్ ఆఫీస్ యూనిట్లను రూ. 103 కోట్ల భారీ విలువతో కొనుగోలు చేసింది. ఇది మొత్తంగా 15,176 చదరపు అడుగుల మేర విస్తరించి ఉంది. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ అనేది పెన్షన్ ఫండ్స్, ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, ఇతర ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్‌మెంట్లను నిర్వహిస్తోంది. ఎస్బీఐ జీసీసీల విషయానికి వస్తే జనవరిలో ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి.. బెంగళూరులో తన గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్‌ను ఆవిష్కరించారు. ఇదే ఎస్బీఐ తొలి జీసీసీ కావడం విశేషం. ఈ కేంద్రాన్ని ఎస్బీఐ తన టెక్నాలజీ, గ్లోబల్ ఆపరేషన్స్ అవసరాల కోసం వినియోగించనుందని చెబుతున్నారు. ఎస్బీఐ.. కొత్త జీసీసీ ఏర్పాటుకు సంబంధించి అప్డేట్ ఇచ్చినా ఎస్బీఐ షేర్ ధర శుక్రవారం సెషన్‌లో పతనమైంది. 0.64 శాతం తగ్గి రూ. 1201.80 వద్ద స్థిరపడింది. 52 వారాల కనిష్ఠ ధర రూ. 680 గా ఉంది. స్టాక్ మార్కెట్ ఒడుదొడుకుల్లో ఉండగా.. ఇటీవల గరిష్ఠాల నుంచి వరుసగా దిగొస్తుంది. మార్కెట్ విలువ రూ. 11.10 లక్షల కోట్లుగా ఉంది.