అతడు లాయర్, ఆమె బీకాం.. కానీ గుడి మెట్లపై భిక్షాటన.. కన్నీళ్లు పెట్టిస్తున్న భార్యాభర్తల స్టోరీ

Wait 5 sec.

ప్రపంచంలోనే అన్ని బంధాల కన్నా భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైంది. పెళ్లి చేసుకున్న తర్వాతి నుంచి.. వారిద్దరూ కన్నుమూసే వరకు కలకాలం ఒకరికి మరొకరు తోడుగా ఉంటారు. దంపతుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా.. ఒకరికి ఇంకొకరు అండగా నిలబడతాడు. ఐశ్వర్యాలు కలిగి ఉన్నప్పుడే కాదు.. అష్ట దరిద్రాల్లోనూ కలిసి ఉండేవారే ఆదర్శ దంపతులు అవుతారు. ఎందుకంటే ఎంతటి కష్టాన్నైనా ఇద్దరూ కలిసి దాటితేనే వారి బంధం పరిపూర్ణం అవుతుంది. అలాంటి భార్యాభర్తలే ఇప్పుడు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ మెట్లపై భిక్షాటన చేస్తూ.. బతుకు బండిని లాగుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆ జంట దీనస్థితి ప్రతీ ఒక్కరినీ కలిచివేస్తోంది. అతడు ఎల్ఎల్‌బీ చదివి లాయర్‌ వృత్తిలోకి వెళ్లాడు. ఆమె బీకాం చదివి.. ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. పెళ్లి చేసుకుని హాయిగా ఉందామని అనుకోగానే కష్టాలు మొదలయ్యాయి. కొన్నేళ్ల వరకు వారి జీవితం సాఫీగానే సాగినా.. ఆ తర్వాతే అసలు సమస్య వచ్చి పడింది. కరోనా మహమ్మారి తర్వాత వారి పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులు అయ్యాయి. అతడి లాయర్ ప్రాక్టీస్ అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఆమె అనారోగ్యంతో ఇంటికే పరిమితమైంది. చివరికి చేతిలో చిల్లి గవ్వలు లేక.. వేములవాడ రాజన్న ఆలయ గుడి మెట్లపై భిక్షాటన చేసే పరిస్థితికి వచ్చారు. ఇక వేములవాడలో భిక్షాటన చేసే వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు వచ్చిన జిల్లా యంత్రాంగం.. ఆ దంపతుల కష్టాలు విని కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన కాసర్ల జలంధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డికి.. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన శిరీషకు.. 2006లో వివాహం జరిగింది. కాసర్ల జలంధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఎల్ఎల్‌బీ పూర్తి చేసి.. కరీంనగర్‌లో లాయర్‌గా ప్రాక్టీస్ చేసేవాడు. ఇక శిరీష బీకాం కంప్యూటర్స్ చదివి.. ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగం చేసేది. కొన్నేళ్ల పాటు వీరి కుటుంబ జీవితం బాగానే ఉండేది. కరోనా వైరస్ వచ్చిన తర్వాత జలంధర్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రాక్టీస్ దెబ్బతిన్నది. దీంతో ఆర్థిక సమస్యలు వచ్చాయి. అదే సమయంలో శిరీష అనారోగ్యం బారిన పడటంతో.. ఎన్ని ఆస్పత్రుల చుట్టు తిరిగినా ఆమెకు వ్యాధి నయం కాలేదు. ఇక జలంధర్ రెడ్డి-శిరీష దంపతులకు పిల్లలు కూడా లేకపోవడంతో వారు జీవితం మీద ఆశలు వదులుకున్నారు. ఈ క్రమంలోనే 2 ఏళ్ల క్రితం వేములవాడకు చేరుకున్నారు. రాజన్న ఆలయ పరిసరాల్లో జీవిస్తున్నారు. గుడిమెట్లపైనే ఉంటున్న ఈ జంట.. చేయి చాచి ఎవరినీ భిక్షం అడగకున్నా.. ఎవరైనా ఇస్తే తీసుకుంటున్నారు. ఇక ఏమీ దొరకనప్పుడు చిన్న చిన్న పనులు చేయడం.. దేవుడి ప్రసాదంతో కడుపు నింపుకోవడం చేస్తున్నారు.ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్‌‌‌‌‌‌‌‌ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలోని అధికారుల బృందం.. వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేసే వాళ్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జలంధర్ రెడ్డి-శిరీష జంటకు సంబంధించిన విషాదగాథ తెలుసుకున్నారు.అయితే కరోనా మహమ్మారితో తమ బతుకులు దుర్భరంగా మారాయని పేర్కొన్న ఆ జంట.. తమకు ప్రభుత్వం ఏదైనా ఉపాధి చూపిస్తే.. ఈ భిక్షాటనకు ముగింపు పలికి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామని చెబుతోంది. తన భార్యకు వైద్యం చేయించేందుకు ఎన్నో ఆస్పత్రులు తిప్పానని.. నయం కాకపోవడంతో ఆమెకు దేవుడు కలలోకి వచ్చాడని.. దీంతో ఆమె వేములవాడకు వచ్చినట్లు జలంధర్ రెడ్డి తెలిపాడు. ఆ తర్వాత తన భార్యను వెతుక్కుంటూ తాను కూడా ఇక్కడికే వచ్చినట్లు చెప్పాడు. నిత్యం గుడి మెట్లను శుభ్రం చేస్తామని పేర్కొన్నాడు. తమను అధికారులు అనాథాశ్రమానికి తీసుకెళ్లినా.. అక్కడ ఉండలేక తిరిగి ఇక్కడేకి వచ్చినట్లు తెలిపాడు.