: అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ.. పెద్ద స్కెచ్ వేసింది. డిజిటల్ పేమెంట్స్‌లో మేజర్ మార్కెట్‌గా ఉన్నటువంటి భారత్‌లో తన చెల్లింపుల సేవల్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు యాపిల్ సంస్థ.. యాపిల్ పే సర్వీసుల్ని త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఈ ఏడాది రెండో అర్ధభాగంలో లేదా వచ్చే ఏడాది ఆరంభంలోనే వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందని సమాచారం. భారత్‌లో పేమెంట్ సర్వీసుల కోసం యాపిల్ కంపెనీ.. ఇప్పటికే భారత్‌లోని దిగ్గజ బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఇదే సమయంలో కార్డ్ ఆధారిత పేమెంట్స్ కోసం వీసా, మాస్టర్ కార్డ్ వంటి సంస్థలతోనూ సంప్రదింపులు చేస్తోంది. ఇక్కడ యూపీఐ సహా కార్డ్ ఆధారిత పేమెంట్స్ చేసేందుకు వీలుగా యాపిల్ పే సర్వీసులు తీసుకొస్తున్నట్లు సమాచారం. ఐఫోన్, యాపిల్ వాచ్ ద్వారా కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ కూడా చేసేందుకు వీలు కల్పించనుంది. ఇంకా ఆర్బీఐ ఇటీవల అనుమతించిన బయోమెట్రిక్ అథెంటికేషన్‌ ద్వారా లావాదేవీలు మరింత సులభతరం కానున్నట్లు తెలుస్తోంది. భారత్‌లోకి యాపిల్ పే సర్వీసులు వస్తే.. అది ప్రస్తుతం వంటి వాటికి గట్టి దెబ్బ తగలనుందని తెలుస్తోంది. వీటికి యాపిల్ పే.. కచ్చితంగా సవాల్ విసురుతుందని చెప్పొచ్చు. భారతదేశంలో 75 కోట్ల మందికిపైగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉన్న కారణంగానే.. యాపిల్ పే సర్వీసుల్ని ఇక్కడ లాంఛ్ చేయాలని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. ఇంకా చాలా మంది విపరీతంగా డేటా కూడా వినియోగిస్తున్నారు. మన దేశంలో ఆండ్రాయిడ్ ఆధిపత్యం ఉన్నప్పటికీ.. కొంత కాలంగా యాపిల్ సంస్థ భారత్‌లో తన పరిధిని విస్తరిస్తోంది. ఇక్కడ రిటైల్ స్టోర్లను తెరుస్తుండటం సహా తయారీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తోంది. గురువారమే భారత్‌లో తన ఆరో స్టోరును ముంబైలో తెరిచింది. ఇంకా యాపిల్ పే అందుబాటులోకి వస్తే.. యాపిల్ వాచెస్, ఐఫోన్స్, ఐప్యాడ్, మ్యాక్స్‌కు మంచి గిరాకీ ఏర్పడనుంది. ప్రస్తుతం భారత స్మార్ట్ ఫోన్ విక్రయాల్లో యాపిల్ వాటా 10 శాతంగా ఉంది. ప్రస్తుతానికి భారత యూపీఐ మార్కెట్లో ఫోన్ పే, గూగుల్ పే హవానే నడుస్తోంది. వీటి ఉమ్మడి వాటానే 80 శాతానికిపైగా ఉంది. అత్యధికంగా ఫోన్‌పే మార్కెట్ వాటా 46-48 శాతం వరకు ఉంది. గూగుల్ పే మార్కెట్ వాటా 35 శాతం వరకు ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 7 శాతం వాటాతో పేటీఎం మూడో స్థానంలో ఉంది.