తెలంగాణలోని 100 నియోజకవర్గాల్లో పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామంలో ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వ పాఠశాల తరహాలోనే కొత్త స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి ప్రతి మండలంలో కనీసం రెండు స్కూళ్లను పబ్లిక్ స్కూళ్లుగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో మొదటి అడుగుగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు. తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తోంది. అధునాతన డిజిటల్ క్లాస్ రూమ్‌లు, ఆడుకోవడానికి విశాలమైన మైదానం, కంప్యూటర్ ల్యాబ్, మంచి బోధన సిబ్బందితోపాటు ఇతర వసతులను ఈ స్కూల్‌లో కల్పించారు. ప్రయివేట్ స్కూళ్ల తరహాలోనే ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియంలో విద్యను బోధిస్తున్నారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఇక్కడ అందుబాటులో ఉంది. అంతే కాదు బడికొచ్చే విద్యార్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనంతోపాటు సాయంత్రం స్నాక్స్ కూడా అందిస్తున్నారు. విద్యార్థుల పురోగతి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులను ఇంటి దగ్గర్నుంచి తీసుకెళ్లి, బడి వేళలు ముగిశాక ఇంటి దగ్గర దిగబెట్టేందుకు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నారు. దీంతో ఈ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా అడ్మిషన్లు 760 నుంచి 1600కి పెరిగాయి. ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ పిల్లలను ఈ బడికి పంపిస్తున్నారు. దీంతో ఆరుట్ల పబ్లిక్ స్కూల్‌ తరహాలోనే కొత్తగా వంద నియోజకవర్గాల్లో పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోర్ అర్బన్ ఏకానమీ రీజియన్ (క్యూర్) పరిధిలో సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో పేరొందిన విద్యా సంస్థలైన భారతీయ విద్యా భవన్, జూబ్లీహిల్స్ పబ్లి్క్ స్కూల్ తరహాలో.. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో అన్ని రకాల వసతులు కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. క్యూర్ పరిధిలో 17 పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయాలని ఇప్పటికే నిర్ణయించగా.. 164 స్కూళ్లలో వసతుల కల్పనపైనా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ పనుల విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని సీఎం అధికారులకు సూచించారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఏఐ గురించి అవగాహన కల్పించాలని కూడా సీఎం ఆదేశించారు. కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకొని.. ప్రభుత్వాధికారులు గనుక చిత్తశుద్ధితో పని చేస్తే తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు కష్టమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీపీఎస్‌లు అందుబాటులోకి వస్తే.. తల్లిదండ్రులకు ఏటా వేలాది రూపాయల ఫీజుల భారం తప్పుతుంది.