ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హుల పట్టాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్లపట్టాల జారీలో భారీగా అక్రమాలు జరిగాయన్నారు. కొందరు నేతలు తమకు నచ్చిన వారికి పట్టాలు ఇచ్చి అక్రమాలకు పాల్పడినట్లు చెప్పుకొచ్చారు. ఈ అక్రమాలపై విచారణ జరిపించి.. అనర్హుల పట్టాలను రద్దు చేస్తామని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అసెంబ్లీలో గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల జారీలో అక్రమాలకు పాల్పడ్డారని, నకిలీ పట్టాలను కూడా ఇచ్చారని ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని జిల్లాలో మరీ దారుణంగా రైతుల నుంచి భూములు కొనుగోలు చేయకముందే పట్టాలు ఇచ్చారని మంత్రి పార్ధసారథి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తుందని తెలిపారు. అలాగే ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత ఒకరి బదులు మరొకరు ఇళ్లు నిర్మించుకున్న ఘటనలు ఉన్నాయని.. ఇద్దరిని కూర్చోబెట్టి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఒకవేళ ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం ఉంటే కనుక వారిపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. ఏపీలో కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎంఏవై కింద అర్బన్‌లో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షలు అందిస్తున్నామని తెలిపారు. అదే రూరల్ ప్రాంతంలో అయితే రూ.1.59 లక్షలు ఇస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతం, గ్రామీణ ప్రాంతంలోని తేడా ఉందన్నారు మంత్రి పార్థసారథి. యూఎల్‌బీ, యూడీఏలో ఒకే రకమైన అమౌంట్ అందించాము అన్నారు. కేంద్రం యూఎల్‌బీ, యూడీఏలను వేరు చేసిందని వివరించారు. యూఎల్‌బీలకు సమానంగా సీఆర్‌డీఏ, వీఆర్‌డీఏల్లో మాత్రమే నిధులు ఇసున్నారన్నారు. అంతేకాదు పట్టాల పంపిణీలో గందరగోళం ఉందని.. దీనిపై విచారణ చేసి అనర్హులకు రద్దు చేస్తామని తేల్చి చెప్పారు.గత ప్రభుత్వ హయాంలో సరిహద్దు రాళ్లు పాతడంపై పెట్టిన శ్రద్ధ.. భూముల రీసర్వేపై చూపించలేదన్నారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌. కూటమి ప్రభుత్వం రీసర్వేను అన్ని సమస్యలు పరిష్కరించేలా, అందరికీ ఆమోదయోగ్యంగా చేస్తోంది అన్నారు. భూ ఆక్రమణలకు తావు లేకుండా కూటమి ప్రభుత్వం 2.0 సర్వేలు నిర్వహిస్తుంది అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6,688 గ్రామాల్లో భూ రీ సర్వే పూర్తి చేశామని.. రికార్డులను డిజిటలైజ్ చేయడం, మ్యుటేషన్‌ను ఆటోమేట్ చేయడం, పారదర్శకతను పెంచడం, భూ వివాదాలను తగ్గించడం కోసం 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జీఓ నంబర్ 1348 ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. త్వరలోనే అన్నిసమస్యల్ని పరిష్కరిస్తామన్నారు.